నేడు గుడ్ ఫ్రైడే

- April 13, 2017 , by Maagulf
నేడు గుడ్ ఫ్రైడే

సర్వ మానవాళి పాప విమోచన కోసం ఏసుక్రీస్తు శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశారు. నేడు విశ్వవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే విషాద ఘట్టాన్ని క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో మననం చేసుకొంటారు. సిలువ మరణ శిక్ష మొదటిగా ఫోనీషియన్లు అమలు పరిచేవారు. వారి నుండి పర్షియన్లు, గ్రీసు దేశస్థులు మరియు రోమన్లు ఈ శిక్షను అమలు పరిచేవారు. నేరస్థుడు వెంటనే చనిపోకుండా తీవ్రమైన బాధను అనుభవిస్తూ నెమ్మదిగా చచ్చిపోవాలి అనే ఉద్దేశ్యంలో భాగంగా రోమన్లు ఈ శిక్షను విధించేవారు. సిలువ శిక్ష అనేది అత్యంత అవమానకరమైన కార్యంగా నాడు భావించేవారు. రోమన్‌ చట్ట ప్రకారం ఆ దేశస్థులకు సిలువ శిక్ష విధించకూడదు. కేవలం బానిసలకు, తిరుగుబాటుదారులకు మరియు పరాయి దేశస్థులకు, నేరస్థులకు ఈ శిక్ష విధించేవారు . ఏసును శిలువ చేసిన స్థలం హేబ్రీ భాషలో గొల్దొతా. లాటిన్‌లో కల్వరి. ఈ పదాలకు  పుర్రె లేదా కపాలం అని అర్థం. ఏసును శిలువ వేసిన కొండ మానవ పుర్రె ఆకారంలో ఉంటుంది. శిలువ బరువు దాదాపు 136 కిలోల కన్నా ఎక్కువ బరువు ఉంటుందని పరిశోధకుల అంచనా. శిలువ వేయబడే నేరస్తుడి తలపై అతడిని ఎందుకు అలా చేయవలసి వచ్చిందో రాసిన పలకను ఏర్పాటు చేస్తారు. ఏసు శిలువైపై నజరేయుడగు ఏసు యూదుల రాజు అనిమూడు భాషలలో రాసి ఉంచారు. ఏసు శిష్యులలో ఒకరైన ఇస్కరియోతు యూదాకు 30  వెండి నాణేలను లంచమిచ్చి అసూయతో ఏసుని పెట్టుకొంటారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యలు,యూదుల కోరిక మేరకు ఏ పాపం ఆయనలో కనబడనప్పటకి   ఏసుకు శిలువ శిక్షను తప్పని పరిస్థితిలో నాటి రోమా గవర్నర్  పిలాతు విధిస్తారు. ఏసుకు సిలువ మరణం ఖరారు చేయబడిన తర్వాత పదునైన ముళ్ళు కలిగిన ముళ్ళ కిరీటాన్ని ఆయన తలమీద పెట్టి... భుజాలపై సిలువను మోపి సుమారుగా ఒక కిలోమీటరు దూరం నడిపించారు. ప్రేతోర్యం అనే స్థలములో యేసుక్రీస్తు అతి తీవ్రంగా కొట్టబడెను. రోమన్లు ఉపయోగించే కొరడా అతి భయంకరమైనది. ఒక్కొక్క కొరడాలో నాలుగు శాఖలుంటాయి. చెక్కతో చేయబడిన పిడి దానికి ఉంటుంది. జంతువుల చర్మముతో చేయబడిన త్రాళ్ళకొనలకు పదునైన ఎండిన ఎముకలు మరియు లోహపు గుళ్ళు ఉంటాయి. కొరడా తయారీని ఊహిస్తేనే భయమనిపిస్తుంది. అటువంటి కొరడాతో యేసుక్రీస్తు ప్రభువును అతి తీవ్రంగా గాయపరిచారు. ముందుగా కొరడా శిక్ష విధించబడిన వ్యక్తి యొక్క వస్త్రములు లాగివేస్తారు. ఏర్పాటు చేయబడిన ఒక మ్రానుకు ఆ వ్యక్తిని కదలకుండా కట్టివేస్తారు. ఆ తరువాత వెనుక భాగమున ఇద్దరు సైనికులు నిలువబడి ఒకరి తర్వాత మరియొకరు విపరీతంగా కొడతారు. దెబ్బలు కొట్టే సైనికులే అలిసిపోతారంటేనే పరిస్థితిని మనం ఊహించుకోవచ్చు. దెబ్బలు కొట్టుచున్నప్పుడు లోహపు గుళ్ళు తీవ్రమైన నొప్పిని కలుగచేస్తాయి... పదునైన ఎముకలు... ముళ్ళు... శరీరంలోనికి దిగబడి మాంసాన్ని పెకిలిస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియలో చాలా మంది తీవ్ర రక్త స్రావం జరిగి అక్కడ కుప్పకూలిపోతుంటారు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆ దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూర్చబడాలని మనకోసం వాటిని భరించెను (1 పేతురు 2:24). మనకు రక్షణ భాగ్యం కలిగించడానికి తీవ్ర బాధను అనుభవించారు. యేసు సిలువను ఎత్తుకొని రక్తం మోడుతూ ఎంతో దూరం ప్రయాసతో నడిచారు. రోమన్ సైనికులు కొరడాలతో యేసుని తీవ్రంగా కొడ్తూ గొల్గొతా కొండపైకి నడిపించారు.మార్గ మధ్యలో కురేనీయుడైన సీమోను కూడా కూడా యేసు సిలువని మోస్తున్నప్పుడు కొద్ది సేపు  సహకరించాడు. సిలువ యొక్క బరువు సుమారుగా 80 నుండి 120 కేజీలు బరువు ఉంటుందని అంచనా. భారభరితమైన ఆ సిలువను యేసు భుజాలపై మోపి గరుకైన ప్రాంతాల్లో నడిపించారు. గొల్గొతా అనగా కపాలమనబడిన స్థలము. మనిషి యొక్క పుర్రె ఆకారంలో ఆ స్థలం ఉంటుంది గనుక దానికి ఆ పేరు వచ్చింది. రోమన్‌ సైనికులందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి శతాధిపతి నాయకుడుగా ఉండి నడిపిస్తాడు. సిలువ వేసే స్థలము నొద్దకు తీసుకొని వచ్చిన తరువాత నేరస్థునికి బోళము కలిపిన ద్రాక్షారసము ఇస్తారు. యేసుక్రీస్తు ప్రభువు దానిని తీసుకోలేదు. వెంటనే నేరస్థుని సిలువపై పండబెట్టి చేతుల్లో కాళ్ళలో మేకులు కొడతారు. ఇశ్రాయేలు దేశంలో లభించిన భూగర్భ శాస్త్రవేత్తల నివేదికల ఆధారంగా ఇనుముతో చేయబడిన మేకులు సుమారు 7 అంగుళాల (18 సెం.మీ) పొడవు ఉండును. సుమారు 1 నుండి 2 సెంటిమీటర్ల మందం ఉండేవి. ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ట్యురిన్‌ వస్త్రపు పరిశోధనల ఆధారంగా మేకులను మణికట్టులో కొట్టేవారని తేలింది. యేసుక్రీస్తు ప్రభువును సిలువ పై ఉంచి చేతులలో కాళ్ళల్లోను కఠినమైన మేకులను దించారు. తీవ్రమైన వేదన యేసు భరించాడు.బళ్ళెముతో పొడవబడినపుడు రక్తమును, నీరును కారెను (యోహాను 19:34) :మేకులతో సిలువకు దిగగొట్టిన తరువాత సుమారు ఆరు గంటలు యేసుక్రీస్తు సిలువపై వ్రేలాడారు. ఏడు మాటలు పలికిన తరువాత పెద్ద కేక వేసి తన ప్రాణమర్పించారు. అయితే విశ్రాంతి దినమున దేహములు సిలువమీద
సిలువలో ఏసు పలికిన మాటలు
ఏసు ప్రభువును ఉదయం 9 గంటలకు శిలువ వేయగా, మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మరణించారు. ‘తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమింపుము’ అన్న మొదటి మాట ఆయనలోని క్షమా గుణాన్ని తెలుపుతోంది. తనతో పాటు సిలువ వేసిన ఒక దొంగ పశ్చాత్తాపానికి ఏసు కరిగి  ‘నేడు నీవు నాతో కూడా పరలోకంలో ఉందువని నిశ్చయంగా చెప్పుచున్నాను’ అనేది రెండవ మాట. ఇక ఏసు పలికిన మూడవ మాట తన శిష్యుడైన యోహానుతో ' ఇదిగో ఈమె నీ తల్లి ‘ తన తల్లి మరియమ్మ  బాధ్యతను అప్పగించాడు. ఈ చర్య ఏసు  ప్రేమ బాంధవ్యాలను సూచిస్తోంది. ‘ఏలీ ఏలీ లామా సబక్తాని’ అనే మాటకు అర్ధం  ' నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి అనే మాట  వియోగాన్ని తెలుపుతుంది. ఆయన పలికిన ‘దప్పిగొనుచున్నాను’ అన్న ఐదవ మాట అన్వేషణకు గుర్తుగా నిలుస్తుంది. ‘శిలువపై క్రీస్తు పలుకులు ' సమాప్తమైనవి’ అన్న ఆరవ మాట తాను పూర్తి చేసిన బలియాగం  విజయమార్గాన్ని బోధిస్తుంది. చివరగా క్రీస్తు పలికిన ఏడవ మాట ‘తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను’ అని పలికారు. లోక రక్షణార్థం ఈ లోకానికి పంపబడిన క్రీస్తు విజయంతో తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణంగా ముగించి లోకానికి రక్షణను అందించి తన ఆత్మను దేవునికి అప్పగించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com