మెగా బ్యాన‌ర్‌లో నాగార్జున‌, నానీల మ‌ల్టీస్టార‌ర్‌

- October 20, 2017 , by Maagulf
మెగా బ్యాన‌ర్‌లో నాగార్జున‌, నానీల మ‌ల్టీస్టార‌ర్‌

క‌థాబ‌లం ఉన్న చిత్రాల‌కు, వెండి తెర‌పై భారీద‌నం కురిపించిన సినిమాల‌కు, స్టార్ వాల్యూ, మేకింగ్ వాల్యూల అరుదైన క‌ల‌యిక‌కు కేరాఫ్ అడ్ర‌స్ వైజ‌యంతీ మూవీస్ సంస్థ‌.  ఈ బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన చిత్రాలెన్నో తెలుగువారి హృద‌యాల్ని గెల‌చుకొని - మ‌ర‌పురాని జ్ఞాప‌కాలుగా మిగిలిపోయాయి.  ఇప్పుడు వైజ‌యంతీ మ‌ళ్లీ పునః వైభ‌వం సాధించే దిశ‌గా అడుగులేస్తోంది. వ‌రుస‌గా సినిమాల్ని తెర‌కెక్కించే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతో క‌ల‌సి సూపర్ స్టార్ మ‌హేష్ బాబుతో  ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది వైజయంతీ మూవీస్‌. ఈ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు. ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డానికి  ఈ సంస్థ‌ సిద్ద‌మైంది. కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నానిల‌తో త్వ‌ర‌లోనే ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్ట‌బోతోంది. 'భ‌లే మంచి రోజు', 'శ‌మంత‌క‌మ‌ణి'లాంటి వైవిధ్య‌మైన చిత్రాల‌తో  త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ‌రామ్ ఆదిత్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సి. అశ్వ‌నీద‌త్ నిర్మాత‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రం జనవరిలో సెట్స్ మీదకి వెళ్లబోతుంది. 
ఈ సందర్భంగా సి.అశ్వ‌నీద‌త్ మాట్లాడుతూ ''నాగార్జున‌, నానీల‌తో మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఇద్ద‌రితోనూ వైజయంతీ మూవీస్‌కి ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. వైజ‌యంతీ మూవీస్ సంస్థ‌లో అత్య‌ధిక చిత్రాల్లో న‌టించిన క‌థానాయ‌కుడు నాగార్జునే. ఆయ‌న‌తో ఇది మా అయిద‌వ చిత్రం. గ‌త చిత్రాల‌కంటే గొప్ప‌గా, అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో ఈ సినిమాని రూపొందిస్తాం. వైజ‌యంతీ మూవీస్ అనుబంధ సంస్థ అయిన స్వ‌ప్న సినిమా ప‌తాకంపై నానీతో తెర‌కెక్కించిన 'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం` చ‌క్క‌టి విజ‌యాన్ని అందుకొంది. వీరిద్ద‌రికీ స‌రిప‌డే క‌థ కుదిరింది. వైజ‌యంతీ మూవీస్ ప్ర‌తిష్ట‌ని మ‌రింత ఇనుమ‌డింప చేసేలా రాబోయే సినిమాలు ఉండ‌బోతున్నాయి. ప్ర‌స్తుతం ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసే ప‌నిలో ఉన్నాం. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం'' అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com