గల్ఫ్ వల్లే ఢిల్లీ కి ముప్పు!

- November 17, 2017 , by Maagulf
గల్ఫ్ వల్లే ఢిల్లీ కి ముప్పు!

భారత దేశ రాజధాని ఢిల్లీలో మునుపెన్నడూ లేని విపత్కర పరిస్థితులు తలెత్తాయి. పొగమంచు ప్రజా జీవనంపై పెను ప్రభావం చూపిస్తోంది. విద్యార్థులకు వరుస సెలవులు ప్రకటించారు. దీనికితోడు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సరి-బేసి సంఖ్య వాహనాల రాకపోకలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ మొట్టికాయలు వేసింది. సాధారణ పౌరులు ఎవరూ బయటకు రావడం లేదు. ఎంతో అర్జంట్ పని ఉంటే తప్ప వీధుల్లోకి రాలేని పరిస్థితి నెలకొంది. ఇంతలా ఢిల్లీని అతలాకుతలం చేసింది పొగమంచు. అయితే, ఒక్కసారిగా ఇలా ఢిల్లీ వాతావరణం మారిపోవడంపై కొందరు అధ్యయనం చేశారు.
ఈ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు, కాలుష్యానికి గల్ఫ్‌ తీరంలో రేగిన అలజడికి సంబంధం ఉందని గుర్తించారు. గల్ఫ్ తుఫాన్‌ తాకిడితో వేల కిలోమీటర్లు దాటి దుమ్ము,ధూళి ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలోకి చొచ్చుకువచ్చాయని, ఫలితంగా ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్ధాయికి చేరిందని ప్రభుత్వ వాయు నాణ్యతా పరిశోధన సంస్థ సఫర్‌ విశ్లేషించింది. ఢిల్లీని కప్పిన పొగమంచులో 40 శాతం కాలుష్య కారకాల్లో గల్ఫ్‌ నుంచి వచ్చిన డస్ట్‌ ఉండగా, పంజాబ్‌, హర్యానాల్లో తగులబెట్టిన పంట వ్యర్థాలు 25 శాతం కారణమని పరిశోధన వెల్లడించింది .
ఇక 35 శాతం ఢిల్లీ లో ఉత్పత్తయ్యే కాలుష్యం పరిస్థితి తీవ్రతకు దారితీసిందని పేర్కొంది. ఉధృతంగా వీచిన గాలుల ప్రభావంతో గల్ఫ్‌ నుంచి వ్యర్థ రేణువులు రాజధానికి రాగా, పొరుగు రాష్ట్రాల్లోని పంట వ్యర్ధాలు తగులబెట్టడం వంటి కారణాలతో ఢిల్లీ వాసులకు కాలుష్యం చుక్కలు చూపిందని పేర్కొంది. ఈ నెల 6 నుంచి 10 మధ్య కాలుష్య ముప్పు పరాకాష్టకు చేరేందుకు ఈ కారణాలు దోహదపడ్డాయని సఫర్‌ చీఫ్‌ గుఫ్రాన్‌ బేగ్‌ స్పష్టం చేశారు. నిజానికి ఈ నెల 7న సాయంత్రం 5 గంటలకు వాయు నాణ్యత ఎన్నడూ లేని విధంగా ఆందోళనకర స్ధాయిలకు పడిపోయిందని పేర్కొన్నారు. అయితే, ఈ పరిణామంపై హుటాహుటిన స్పందించిన కేజ్రీవాల్ ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించింది. అయినా కూడా పరిస్థితి ఇప్పటికీ సర్దుమణగక పోవడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com