భోగి పండుగ ప్రత్యేకత

- January 14, 2018 , by Maagulf
భోగి పండుగ ప్రత్యేకత

తెలుగు రాష్ట్రాలలో పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజులలో మెదటిరోజే భోగి. సంక్రాంతికి ఒక రోజు ముందు వచ్చే  భోగి పండుగలో ముఖ్యమైనవి భోగి పళ్ళు, భోగి మంటలు, భోగి పులక, గాలిపటాలు, కోడి పందాలు. 

భోగి రోజు సాయంత్రం తమ ఇంట్లోని చిన్న పిల్లల తలపై భోగిపండ్లు పోస్తారు. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, కొందరు చిల్లర నాణేలు కూడా  వాడతారు. మరి కొందరు శనగలు కూడా కలుపుతారు. భోగి పళ్లను పిల్లల తల మీద పోడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. 

ముఖ్యంగా రేగుపండ్లు  పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపొతుందని నమ్ముతారు. భోగి పండ్లను పోవటం వలన తలపై ఉండే బ్రహ్మరంధ్రం ప్రేరేపితమవుతుందని, దీని వల్ల పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని పెద్దలు చెబుతారు. 

దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా దూరం అవుట వలన భూమిపై చలి బాగా పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చిందని చెబుతారు. 

భోగి రోజున తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య మంటలు వేస్తారు. దీనినే భోగి మంటలు అంటారు. భోగి మంటలలో పాత వస్తువులను వేయటం ఆనవాయితీ.  భోగం అనే పేరుకు అర్ధం అనుభవం. దేనిని అనుభవించడం వలన మనకు ఆనందం కలుగుతుందో దానిని భోగం అంటారు. అలాంటి భోగము అనుభావిన్చావాల్సిన రోజునే భోగి అంటారు. చలి పెరిగిన కాలంలో వెచ్చధనమే ఒక భోగం కాబట్టి భోగి నాడు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
 
పంటలు చేతికొచ్చిన తర్వతా మరొక పంట కొరకు రైతులు తమ సాగుభూమికి నీరు పారించి తడి పెడతారు. పంటకు నీరు పారించి తడి చేస్తారు కనుక పులకేయడం అని పిలుస్తారు. ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులకగా పెద్దలు చెబుతారు. కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున పౌరుషానికి ప్రతీకగా కోడిపందాలు నిర్వహిస్తే, మరి కొన్ని ప్రాంతాల్లో గాలిపటాలు ఎగరవేయడంలో పోటీపడుతుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com