నేతాజీ సుభాష్ చంద్ర బోస్: స్పెషల్ స్టోరీ

- January 23, 2018 , by Maagulf
నేతాజీ సుభాష్ చంద్ర బోస్: స్పెషల్ స్టోరీ

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ (జనవరి 23, 1897 ) గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసా వాదం తోనే స్వరాజ్యం సిద్ధి స్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే సుభాష్ చంద్ర బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సుభాష్ చంద్ర బోస్ రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన విభేదాలు వచ్చి చివరకు అభిప్రాయ భేదాలతో గాంధిజి తో పొసగక ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసా వాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని నేతాజీ భావన. ఈ అభి ప్రాయాల తోనే "ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్" అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు.

దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణ అవకాశంగా నేతాజీ భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో "భారత జాతీయ సైన్యం" ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో "ఆజాద్ హింద్ ప్రభుత్వం" ను సింగపూర్ లో నెలకొల్పాడు.

నేతాజీ రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ మరియు జపాను తో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు నాటి వాస్తవిక దృష్టి తో చేసిన ప్రయత్నాలుగా నేతాజీ ని అభిమానిస్తారు. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18 లో తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరిణించారని ప్రకటించినప్పటికి, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతంలోకి వెళ్ళాడని పలువురు ఇప్పటికి నమ్ముతారు. సుభాష్ చంద్రబోస్ 1897 లో, ఒడిషా లోని కటక్ పట్టణంలో జానకినాథ్ బోస్ మరియు ప్రభావతి దేవిల సుపుత్ర రత్నంగా జన్మించాడు. తండ్రి నడు సుసంపన్న సుప్రసిద్ధ లాయరు. తీవ్రమైన జాతీయవాది. బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి కూడా ఎన్నికయ్యాడు.

నేతాజి విద్యాభ్యాసం కటక్‌లోని రావెన్షా కాలేజియేట్ స్కూలులోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజిలోను, ఫిట్జ్ విలియమ్ కాలేజిలోను, చైతన్య జికేవిశ్వవిద్యాలయంలో కొనసాగింది.

1920లో సుభాష్ చంద్ర బోస్ భారతీయ సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరై దేశంలోనే నాలుగవ ర్యాంకులో నిలిచాడు. ఇంగ్లీషులో అత్యధిక మార్కులు సాధించాడు. అయినా 1921 ఏప్రిల్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు నుండి వైదొలగి భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొననారంభించాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించ సాగాడు.

"ఒకసారి సుభాస్ చంద్ర బోస్ హిట్లర్ ను కలవడానికి వెళ్ళాడు. 10 నిముషాల తరువాత హిట్లర్ వచ్చి ఏమిటి విషయం అని అడిగాడు. వెంటనే సుభస్ చంద్ర బోస్ "మీ బాస్ ను రమ్మని చెప్పు" అన్నాడు. వెంటనే హిట్లర్ వచ్చి, నేతాజి భుజం మీద చరిచి ఎలా ఉన్నావు అని అడిగాడు. ఇద్దరు కలసి విషయాలు చర్చించుకున్న తరువాత వెళ్ళబోయేటప్పుడు హిట్లర్, నెతాజిని ముందుగా నిన్ను కలవడానికి వచ్చింది నేను కాదని ఎలా గుర్తించావు అని అడిగాడు. బోస్ భుజాన్ని తట్టే ధైర్యం నిజమైన హిట్లర్ కి తప్ప ఇంకా ఎవరికి లేదు అని జవాబిచ్చాడు. ఇది ఆయనలోని సూక్ష్మ గ్రాహ్యతకు నిదర్శనం"

సహాయ నిరాకరణోద్యమం సమయంలో మహాత్మా గాంధీ నేతాజిని కలకత్తా పంపాడు. అక్కడ చిత్తరంజన్ దాస్ తో కలసి బెంగాల్‌లో ఉద్యమం నిర్వహించాడు. ఐరోపాలో ఉన్న సమయంలో సుభష్ ఆలోచనలలో క్రొత్త మార్పులు చోటు చేసుకొన్నాయి. స్వతంత్ర దేశంగా అవతరించడానికీ, మనడానికీ భారత దేశానికి ఇతర దేశాల సహకారం, దౌత్య సంబంధాలు, ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించాడు. 1937 డిసెంబరు 26న బోస్ "ఎమిలీ షెంకెల్" అనే ఆస్ట్రియా వనితను (తన సెక్రటరీ) వివాహం చేసుకొన్నాడు. వారికి 1942 లో పుట్టిన కూతురు పేరు అనిత బోస్. తన భార్యకు వ్రాసిన అనేక ఉత్తరాలను తరువాత "Letters to Emilie Schenkl " అనే పుస్తకంగా శిశిర్ కుమార్ బోస్, సుగాతా బోస్ ప్రచురించారు.

1938లో, మహాత్మా గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా, నేతాజీ బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు, ప్రత్యర్థి అయిన పట్టాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీ భావించాడు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్లనే కాంగ్రెస్‌ నుండి నాడు నేతాజి వైదొలగవలసివచ్చింది. వేరు మార్గం లేని బోస్ "అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్" పార్టీని స్థాపించాడు. 1938లో "జాతీయ ప్రణాళికా కమిటీ" అనే సంస్థాగత వ్యవస్థకు నాంది పలికాడు.

బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరాక దేశానికి స్వతంత్రం ఇస్తారని మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి నాయకులు భావించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో తల మునకలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశంగా తీసుకొని త్వరగా స్వతంత్రాన్ని సంపాదించాలని నేతాజీ బలంగా వాదించాడు. ఆయన ఆలోచన లపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు గారిబాల్డీ మరియు మాజినీ ప్రభావం ఉండేది. స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశం "ముస్తఫా కమాల్ పాషా అతాతుర్క్" నాయకత్వం లోని టర్కీ దేశంలాగా కనీసం రెండు దశాబ్దాల కాలం సోషలిస్టు నియంతృత్వ పాలనలో ఉండాలని కూడా నేతాజీ బోస్ అభిప్రాయం.

ఈ సమయంలో సుభాష్ బోస్ అనేక మంది బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలుసుకొన్నాడు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ నాయకులెవరూ నేతాజి బోస్‌తో సమావేశానికి అంగీకరించలేదు. తరువాత లార్డ్ అట్లీ నాయకత్వంలోని లేబర్ పార్టీ ప్రభుత్వం కాలం లోనే భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించిందన్నది గమనించవలసిన విషయం.

అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం సుభాష్ చంద్ర బోస్ ఆగష్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడలేదు. దీనివల్ల ఆయన బతికిఉండవచ్చునని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి నేతాజి సోవియట్ యూనియన్ కు బందీగా ఉండగా సైబీరియాలో మరణించాడని. దీనిని విచారించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది. నేడు ఆ మహనీయునికి 120యేళ్ళు నిండాయి. నేడాయన 121వ జన్మదినం. ఆయన ఆత్మకు శుభం చేకూరాలని ప్రార్ధిద్ధాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com