తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజాల క్యూ..

- March 12, 2018 , by Maagulf
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజాల క్యూ..

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక దిగ్గజాలు క్యూ కడుతున్నాయి. రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పేందుకు జపాన్‌కు చెందిన ఇసే ఫుడ్స్‌ ముందుకొచ్చింది. 140 ఎకరాల్లో పరిశ్రమలు పెట్టేందుకు ఎంవోయూ కుదుర్చుకుంది. రెణ్నెల్ల క్రితం జపాన్‌లో పర్యటించిన కేటీఆర్‌.. తెలంగాణలో అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆహ్వానించారు.

తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పేరున్న కంపెనీలు.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. తాజాగా జపాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ఇసే ఫుడ్స్ తెలంగాణలో అడుగు పెట్టింది. సిద్దిపేట జిల్లా నంగనూర్ మండలం నర్మెట్ట గ్రామంలో 140 ఎకరాల్లో పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ఇసే ఫుడ్స్ తెలిపింది. ఇసే ఫుడ్స్, నేషనల్ బ్యాడ్మింటన్ అకాడమీ మధ్య ఎంవోయూ కుదిరింది.

హైదరాబాద్‌ వచ్చిన జపాన్ ప్రధాని ప్రధాన సలహాదారుల బృందంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలోని ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు జపాన్‌ ముందుకు రావడం అభినందనీయమన్నారు. తెలంగాణను సీడ్ బౌల్ అఫ్ ఇండియాగా మార్చాలన్న లక్యంతో ముందుకు వెళ్తున్నట్లు జపాన్ ప్రతినిధులకు వివరించారు కేటీఆర్‌.

విదేశీ పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా.. జనవరిలో ఐటీ మంత్రి కేటీఆర్‌ జపాన్‌లో పర్యటించారు. ప్రముఖ కంపెనీల అధినేతలను కలిసి... తెలంగాణలో ఉన్న విస్తృత అవకాశాలను వివరించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగానికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించిన కేటీఆర్‌.. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఇసే ఫుడ్స్‌ చైర్మన్‌ హికోనో బుఐసెను కోరారు. తెలంగాణలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు జైకా వంటి జపాన్‌ ఆర్థిక సంస్థలు ఇప్పటికే రుణ సాయం అందించాయని గుర్తు చేశారు. కేటీఆర్‌ ప్రజెంటేషన్‌కు ఫిదా అయిన ఇసే ఫుడ్స్‌.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com