పాకిస్థాన్‌కు మోదీ సూపర్ పంచ్

- April 28, 2018 , by Maagulf
పాకిస్థాన్‌కు మోదీ సూపర్ పంచ్

భారత్‌–చైనా బంధాల్లో నవశకం మొదలైంది. ఆసియాలో కీలక శక్తులుగా ఉన్న రెండు దేశాలు విభేదాలను చెరిపేసుకుని నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు స్వస్తి చెప్పి.. ప్రపంచ ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలవాలని నిర్ణయించాయి. చైనా పర్యటన వేదికగా పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ సూపర్ పంచ్ ఇచ్చారు. చైనాతో కలిసి ఆప్ఘనిస్థాన్‌లో ఆర్థిక ప్రాజెక్టుకు చేపట్టేందుకు సై అన్నారు.

చైనా అండ చూసుకుని మిడిసిపడుతున్న పాకిస్తాన్‌ను.. నరేంద్ర మోడీ తిరుగులేని దెబ్బ కొట్టారు. దాయాదికి పక్కలో బల్లెంలా మారిన ఆప్ఘనిస్తాన్‌లో.. భారత్‌, చైనా సంయుక్తంగా ఆర్ధిక ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆత్మీయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు అవసరమైన విధివిధానాలపై రెండు దేశాల అధికారులు త్వరలోనే చర్చలు జరపనున్నారు.

భారత్‌, చైనాల సంయుక్త ఆర్థిక ప్రాజెక్టు.. పాకిస్థాన్‌కు తలనొప్పిలా మారే అవకాశాలున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో మారణహోమం సృష్టిస్తున్న తాలిబన్లకు పాకిస్తాన్ ఆశ్రయమిస్తోందంటూ అమెరికా చాలాకాలంగా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పుడూ పాకిస్తాన్‌ను వెనకేసుకొచ్చే చైనా.. ఈసారి మాత్రం దిమ్మతిరిగే షాకిచ్చింది. తాలిబన్ల ధాటికి కుదేలు అవుతున్న అప్ఘనిస్తాన్‌లో ఓ ఆర్థిక ప్రాజెక్టును చేపట్టడం ఇదే తొలిసారి. అది కూడా భారత్‌, చైనాలు కలిసి ఈ ప్రాజెక్టును నిర్వహించడంతో పాకిస్థాన్‌కు సూపర్‌ పంచ్‌ తగిలినట్లైంది.

భారత్‌, చైనాలు ప్రపంచ ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటివని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చెప్పారు. సరికొత్త సంస్కరణలతో మోదీ భారత్‌ను అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని ప్రశంసించారు. 21వ శతాబ్ధంలో చైనా- భారత్‌ కలిసి ప్రపంచ నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తామని జిన్‌పింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక.. ఇరు దేశాల మధ్య ఇలాంటి చర్చలు తరచూ జరుగుతూ ఉండాలని మోడీ అభిలషించారు. 2019లో భారత్‌లో జరిగే చర్చలకు రావాలని జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు. భారత్, చైనాలు కలసి పనిచేస్తే తమ దేశాల ప్రజలతో పాటు ప్రపంచానికి మేలు చేసేందుకు గొప్ప అవకాశం లభిస్తుందని మోడీ తెలిపారు.

మరోవైపు రెండోరోజు ఇరు దేశాధినేతలు చాయ్‌ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడీ, జిన్‌పింగ్‌ టీ తాగుతూ ఈస్ట్‌ లేక్‌ తీరంలోని ప్రకృతి అందాల్ని ఆస్వాదించారు. తీరం వెంబడి పక్కపక్కనే నడుచుకుంటూ ఇరుదేశాల మధ్య సంబంధాలపై మాట్లాడుకున్నారు. ఈస్ట్‌లేక్‌లో హౌస్‌బోట్‌లో విహరించారు. అనంతరం ప్రధాని మోడీ చైనా పర్యటన ముగించుకుని భారత్‌ చేరుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com