హైదరాబాద్‌ పోలీసుల చేతికి సరికొత్త బ్రహ్మాస్త్రం

- May 10, 2018 , by Maagulf
హైదరాబాద్‌ పోలీసుల చేతికి సరికొత్త బ్రహ్మాస్త్రం

హైదరాబాద్‌: పోలీసుల చేతికి సరికొత్త బ్రహ్మాస్త్రం అందబోతోంది. ఒకేసారి లక్ష మందికి సందేశాలు, ఆడియో, వీడియోలను పంపేలా వాట్సాప్‌ను పోలి ఉండే సరికొత్త మొబైల్‌ అప్లికేషన్‌ను తెలంగాణ పోలీసు శాఖ రూపొందించింది. దీంతో రాష్ట్రంలోని 60 వేల మందికిపైగా పోలీసులకు ఎలాంటి సమాచారాన్నయినా క్షణాల్లో చేరవేయొచ్చు. ఫలితంగా పోలీసుల పనితీరులో గణనీయమైన మార్పు వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీసు శాఖ సమాచార మార్పిడికి సెల్‌ఫోన్‌తోపాటు వాట్సాప్‌లను ఉపయోగించుకుంటోంది. రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో పోలీసుల సంఖ్య 60 వేల వరకు ఉంది. వేగంగా సమాచారం పంపించడానికి వీరందరితో ఒకే వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేద్దామన్నా వీలుకాదు. ఎందుకంటే ఒక వాట్సాప్‌ గ్రూప్‌లో 256 మందిని చేర్చడానికే పరిమితి ఉంటుంది. దీనితో ఎక్కడికక్కడ పోలీసుల కోసం చిన్నచిన్న వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల నుంచి రేంజి అధికారులకు, అక్కడి నుంచి జిల్లాలకు, కమిషనరేట్లకు, అక్కడి నుంచి స్టేషన్ల స్థాయికి ఇలా సమాచార మార్పిడికి చాలా సమయం పడుతోంది. అంతేకాదు ఈ గ్రూపుల్లోని సమాచారాన్ని కొంతమంది వ్యక్తిగత గ్రూపుల్లోకి పంపించడంతో ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. వీటన్నింటినీ అధిగమించేలా వాట్సాప్‌ను మించి సేవలను అందించడానికి సరికొత్త మొబైల్‌ యాప్‌ను రూపొందించాలని డీసీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌ నగర పోలీసు సాంకేతిక బ అందం శ్రీనాథ్‌ నేత అత్వంలో ఈ కొత్త వ్యవస్థకు రూపకల్పన చేసింది. ఇప్పటికే దీన్ని విజయవంతంగా ప్రయోగించి చూశారు. ఈ కొత్త యాప్‌నకు ప్రత్యేక సమాచార నిధి (డేటా బేస్‌) తయారు చేశారు. దీని సర్వర్‌ నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేయబోతున్నారు. పోలీసులు మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉండే ఈ యాప్‌కు 'కాప్‌ కనెక్ట్‌' అనే పేరు పెట్టారు. 
రాష్ట్రంలోని 60 వేల మంది పోలీసులతో ఒక గ్రూపు ఏర్పాటు చేస్తున్నారు. అంటే కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు ఈ గ్రూపులో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర పోలీసు శాఖ నుంచి లేదా డీజీపీ నుంచి అన్ని స్టేషన్ల పోలీసులకు, ఇతర అధికారులకు ఎలాంటి సందేశంగానీ, ఆడియో, వీడియో పంపాలన్నా ఇందులో పోస్టు చేస్తే చాలు క్షణాల్లో అందరికీ సమాచారం చేరుతుంది. ఈ సమాచారాన్ని బయట వారికి పంపించడానికి కూడా వీలుండదు. ఇదే తరహాలో రాష్ట్రంలో ఉన్న సీఐలు, ఎస్సైలతో గ్రూపులను ఏర్పాటు చేస్తారు. క్రైం కానిస్టేబుళ్లు, కోర్టు కానిస్టేబుళ్లు ఇలా.. వివిధ విభాగాల బృందాలను ఏర్పాటు చేసి వారికి సంబంధించిన సమాచారాన్ని అందులో ఉంచుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com