వందలాది మొసళ్లను కొట్టిచంపేశారు

- July 16, 2018 , by Maagulf
వందలాది మొసళ్లను కొట్టిచంపేశారు

సొరోంగ్: ఇండోనేషియాలో ఓ వ్యక్తి ప్రాణం తీశాయన్న కోపంతో స్థానికులు వందలాది మొసళ్లను ఒక్కపెట్టున కొట్టి చంపిన వైనమిది. పపువా ప్రావిన్స్‌లోని సొరోంగ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. 45 ఏళ్ల బాధితుడు సుగిటో అంత్యక్రియల అనంతరం మొసళ్లపై స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. జనావాసాల్లో మొసళ్లను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ క్రోకోడైల్ ఫామ్‌పై మూకుమ్మడి దాడి చేశారు. పశువులకు గడ్డి తెచ్చేందుకు వెళ్లిన బాధితుడు.. ప్రమాద వశాత్తూ జారి మొసళ్లను పెంచుతున్న ఎన్‌క్లోజర్‌లో పడ్డాడు. తొలుత మొసళ్లు ఆయన కాలిని బలంగా కొరికి గాయపర్చగా... ఓ మొసలి తన తోకతో ఆయనను గట్టిగా ఒడిసిపట్టుకుంది.

రెసిడెన్సియల్ ప్రాంతంలో మొసళ్ల ఫామ్ ఉండడంపై సుగిటో బంధువులు, స్థానికులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుడికి నష్టపరిహారం చెల్లించేందుకు ఫామ్ యాజమాన్యం అంగీకరించినట్టు అధికారులు వారితో చెప్పారు. అయితే దీనిపై సంతృప్తి చెందని మృతుడి బంధువులు వందలాదిగా కత్తులు, గడ్డపారలతో క్రోకోడైల్ ఫామ్‌పై దాడి చేశారు. నాలుగు అంగుళాల పొడవు నుంచి రెండు మీటర్ల పొడవున్న పెద్ద మొసళ్ల వరకు మొత్తం 292 మొసళ్లను చంపేశారని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com