హైదరాబాద్:ప్రకంపనలు సృష్టిస్తున్న కరక్కాయల మోసం..

- July 17, 2018 , by Maagulf
హైదరాబాద్:ప్రకంపనలు సృష్టిస్తున్న కరక్కాయల మోసం..

హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులో కరక్కాయల మోసం ప్రకంపనలు సృష్టిస్తోంది. మామూలు కరక్కాయల బూచి చూపి 5 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సాప్ట్‌ ఇంటిగ్రేట్‌ మల్టీ టూల్‌ ప్రైవేట్  లిమిటెడ్‌ అనే సంస్థ కరక్కాయలను తీసుకెళ్లి పౌడర్ చేసి అప్పగిస్తే.. కేజీకి 3 వందలు లాభం ఇస్తామంటూ స్థానికులను నమ్మించింది. యూట్యూబ్‌, యాప్‌లలో ప్రచారం చేసింది. కేజీ కరక్కాయలు వెయ్యి రూపాయలు చెల్లించి తీసుకెళ్లాలని నిబంధన పెట్టింది. 3 వందలు లాభం వస్తుందన్న నమ్మకంతో చాలా మంది వేల రూపాయలు చెల్లించి భారీ మొత్తంలో కరక్కాయలు కొనుగోలు చేశారు. పొడి చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లేందుకు సదరు కంపెనీ ముందుకు రాకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. తమ దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి వారు బిచాణా ఎత్తివేసినట్టు తెలియడంతో బాధితులు షాక్‌కు గురయ్యారు. మొత్తం 5 కోట్లు సేకరించి టోపీ పెట్టారు. 

కరక్కాయల కోసం తమతో పాటు తమ బంధువులు కూడా లక్షల్లో డబ్బులు కట్టి మోసపోయామని బాధితులు వాపోయారు. తమను నమ్మించేందుకు మొదటి 15 రోజులు డబ్బులు బాగానే ఇచ్చారని... తర్వాత నుంచి పత్తా లేకుండా పోయారని తెలిపారు. కరక్కాయ పొడికి ఆయుర్వేదంలో మంచి డిమాండ్‌ ఉందని, దీనికి సంబంధించిన యాడ్స్‌ యూట్యూబ్‌ పోస్ట్‌ చేస్తే డబ్బులు ఇస్తామని కూడా మోసానికి పాల్పడ్డారని చెబుతున్నారు. కరక్కాయ పొడికి మోసపోయామని గ్రహించిన బాధితులు కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులోని ఆఫీస్‌కు వెళ్లారు. అక్కడి సిబ్బందిని పోలీసులకు పట్టించారు. నెల్లూరుకు చెందిన దేవరాజ్, మేనేజర్ మల్లికార్జున్‌ ఈ మోసం వెనుక సూత్రధారులుగా తేలింది. అటు, ఈ అక్రమ దందా బాధితులు వరంగల్‌లోనూ ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ కూడా చాలా మందిని ఈ ముఠా మోసం చేసి లక్షలకు లక్షలు వసూలు చేశారు. దీంతో.. న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్లకు పరుగులు పెడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com