ఢిల్లీ:వాహనాలకు ఇక రంగుల స్టిక్కర్స్‌

- August 13, 2018 , by Maagulf
ఢిల్లీ:వాహనాలకు ఇక రంగుల స్టిక్కర్స్‌

ఢిల్లీ:ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికారులు గతంలో సరి-బేసి విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సరి సంఖ్య ఉన్న వాహనాలు ఒక రోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు ఒక రోజు రోడ్ల మీద తిరిగేలా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు వాయు కాలుష్యాన్ని నియంత్రించే దానిలో భాగంగా సరికొత్త ప్రణాళికను తీసుకువచ్చారు. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు రంగుల స్టిక్కర్స్‌ అతికించేందుకు కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం స్వాగతించింది. డీజిల్‌ వాహనాలకు ఆరెంజ్‌ కలర్‌ స్టిక్కర్‌, పెట్రోల్‌, సీఎన్‌జీ వాహనాలకు బ్లూకలర్‌ స్టిక్కర్స్‌ అతికించనున్నారు. ఆ స్టిక్కర్‌ మీద వాహనాన్ని ఎప్పుడు తయారు చేశారనే దానికి సంబంధించిన సంవత్సరాన్ని పొందుపరుస్తారు. సెప్టెంబరు 30 నుంచి దిల్లీ-నేషనల్‌ కాపిటల్‌ రీజియన్‌(ఎన్‌సీఆర్‌) పరిధిలో ఈ కలర్‌ స్టిక్కర్స్‌ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. దీని వల్ల పాత వాహనాలను త్వరగా గుర్తించడం సాధ్యమవుతుందని వాటిని నిలిపివేయడం సులభతరం అవుతుందని అధికారులు కోర్టుకు వెల్లడించారు.

కాలం చెల్లిన వాహనాల కారణంగా వాయు కాలుష్యం అధికమవుతుండటంతో వీటిని నియంత్రించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. కోర్టు నియమించిన అమికస్‌ క్యూరీ వాయు కాలుష్య నియంత్రణకు ఈ రంగు స్టిక్కర్ల విధానాన్ని తీసుకొస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. దీనిపై కేంద్ర రవాణాశాఖ సానుకూలంగా స్పందించింది. పారిస్‌లో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని, దిల్లీలో ప్రవేశపెట్టిన సరి, బేసి విధానం కంటే ఇది ఇంకా మెరుగ్గా పని చేస్తుందని, పాత వాహనాలను దీని ద్వారా సులభంగా గుర్తిస్తామని అమికస్‌ క్యూరీ సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌ వాహనాలకు గ్రీన్‌ నంబర్‌ ప్లేట్స్‌ కేటాయించాలనే దాన్ని పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం తరఫు హాజరైన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఏఎన్‌ఎస్‌ నద్‌కర్నికి సూచించింది. ఈ విషయంపై సదరు మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని సొలిసిటర్ జనరల్‌ కోర్టుకు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com