తొలిసారిగా తాలిబన్‌ సంస్థతో భారత్‌ చర్చలు

- November 08, 2018 , by Maagulf
తొలిసారిగా తాలిబన్‌ సంస్థతో భారత్‌ చర్చలు

ఢిల్లీ: భారత్ దేశ చరిత్రలోనే తొలిసారిగా తాలిబన్‌ సంస్థతో భారత్‌ చర్చలకు సిద్ధమైంది. నిత్యం యుద్ధంతో భీతిల్లిపోతున్న అఫ్గానిస్థాన్‌లో శాంతిని నెలకొల్పే అంశంపై రష్యా శుక్రవారం ఓ సమావేశం ఏర్పాటుచేసింది. దీనికి అమెరికా, పాకిస్థాన్‌, చైనాతో పాటు భారత్‌ను కూడా ఆహ్వానించింది. ఇదే సమావేశానికి తాలిబన్‌ సంస్థ ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. ఇందులో భాగంగా భారత్‌, తాలిబన్‌ మధ్య చర్చలు జరిగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది అనధికారిక భేటీగా తెలుస్తోంది.

ఈ భేటీకి అఫ్గాన్‌లోని భారత రాయబారి అమర్‌ సిన్హా, పాకిస్థాన్‌లో భారత మాజీ హైకమిషనర్‌ టీసీఏ రాఘవన్‌ భారత్‌ తరఫున హాజరవుతున్నారు. సమావేశంలో భాగంగానే తాలిబన్‌ సంస్థతో భారత్‌ భేటీ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడు ఈ సమావేశానికి ఆహ్వానించారు.

‘అఫ్గాన్‌ అంశంపై రష్యా ఫెడరేషన్‌ నవంబరు 9న మాస్కోలో సమావేశం ఏర్పాటు చేసింది. దానికి భారత్‌ను కూడా ఆహ్వానించింది’ అని మీడియా అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ సమాధానమిచ్చారు. అఫ్గానిస్థాన్‌లో శాంతి, సౌభ్రాతృత్వం, స్థిరత్వం, భద్రత, ఐక్యత, బహుళత్వం నెలకొల్పేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటికి భారత్‌ అన్ని విధాలా మద్దతిస్తుందని ఈ సందర్భంగా రవీశ్‌ కుమార్‌ అన్నారు. అఫ్గాన్‌లో శాంతి కోసం భారత్ తాలిబన్‌ సంస్థతో చర్చలు జరపడం ఇదే తొలిసారి కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com