ఏ.పికు వెల్లువలా వస్తున్న పెట్టుబడులు

- January 10, 2019 , by Maagulf
ఏ.పికు వెల్లువలా వస్తున్న పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి.. ఐటీ మంత్రి లోకేష్‌ల చొరవతో సన్‌రైజ్‌ స్టేట్‌ ఆంధ్ర ప్రదేశ్‌కు పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే పలు మెగా కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోగా.. ఇప్పుడు ఏపీ ఐటీ శాఖతో అదాని గ్రూప్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ రంగంలో ఉన్న అనేక పెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చొన మంత్రి లోకేష్ చొరవతో మరో అతి పెద్ద విజయం దక్కింది. ఇర‌వై ఏళ్లలో ల‌క్ష ఉద్యోగాలు క‌ల్పించే ఈ సెంట‌ర్ కోసం అదానీ గ్రూప్ 70 వేల కోట్ల రూపాయ‌లు పెట్టుబ‌డులు పెట్టనుంది. విశాఖపట్నంలోని 500 ఎకరాల్లో మూడు ప్రాంతాల్లో 1 గిగా వాట్ డాటా సెంటర్‌ను అదాని గ్రూప్‌ ఏర్పాటు చేయనుంది..

ఏపీలో ఐటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి సూచ‌న‌ల‌తో మంత్రి లోకేష్ వివిధ పాల‌సీలు రూపొందించారు. ఈ పాల‌సీల్లో ఒక‌టైన క్లౌడ్ హబ్ పాలసీ అదానీ గ్రూప్ విశాఖ త‌ర‌లివ‌చ్చేందుకు దోహ‌ద‌ప‌డింది. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనువైన పరిస్థితులు గురించి అదానీ గ్రూప్ ప్రతినిధుల‌తో పలుదఫాలుగా భేటీ అయ్యి వివరించారు లోకేష్‌.. దీంతో ప్రపంచంలోనే మొట్టమొదటి పర్యావరణహిత డేటా సెంటర్ పార్క్‌ని విశాఖపట్నంలో అదానీ గ్రూప్ ఏర్పాటు చేయ‌నుంది. పార్క్ ఏర్పాటులో భాగంగా 5 గిగా వాట్స్ సోలార్ పార్క్‌ని కూడా నెల‌కొల్పనున్నారు. ఈ డేటా సెంటర్‌ని ఇంటర్నెట్ కేబుల్ లాండింగ్ స్టేషన్‌తో అనుసంధానించ‌డం ద్వారా దేశవ్యాప్తంగా మెరుగైన ఇంట‌ర్నెట్ సేవ‌లు అందించే కీల‌క కేంద్రంగా ఏపీ మార‌నుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, హార్డ్ వేర్ సప్లయర్స్, సాఫ్ట్ వేర్, స్టార్ట్అప్, టెలికాం కంపెనీలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చే అవకాశాలు పెరిగాయి.

అదాని గ్రూప్ సారధ్యంలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్‌తో దేశానికే డేటా సెంటర్ హబ్‌గా ఏపీ మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జిడిపి వృద్ధికి డేటా సెంటర్లు దోహదం చేస్తాయన్నారు ఆయన..

డేటా సెంటర్ల విషయంలో భారతదేశం చాలావరకూ వెనకబడింది. చెన్నై, ముంబైలలో మాత్రమే ఈ సెంటర్లున్నాయి. 2016 నాటికి దేశంలో డేటా సెంటర్ల రంగం అభివృద్ధి 160 బిలియన్ డాలర్లు కాగా, ఇది ప్రపంచంతో పోల్చితే 2 శాతమే. ప్రతి ఏడాది ఈ రంగం 20 శాతం పెరుగుదల సాధిస్తోంది. డేటా సెంటర్ల ఏర్పాటుతో దీనిపై ఆధార పడిన అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించడం వల్ల వృద్ధి రేటు పెరుగుతుంది. క్లౌడ్ హబ్ పాలసీ ద్వారానే అదానీ గ్రూప్ తన డేటా సెంటర్ పార్క్ ని ఏపీలో నెలకొల్పబోతోంది. ఈ కార్యక్రమంలో ఐటీ సెక్రెటరీ విజయానంద్,అదాని గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com