జగన్ కేబినెట్ లో వారికి బెర్త్ ఖాయం..!
- May 27, 2019ఏపీలో అఖండ విజయం సాధించిన జగన్ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిసారించారు. మే 30న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఈలోపే కేబినెట్ కూర్పుపై ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. జగన్ ఇప్పుడే పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారా.. లేదంటే పలు దఫాలుగా విస్తరణ ఉంటుందా అన్నదానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. సామాజిక సమీకరణాలు, ఇతర ఈక్వేషన్స్ దృష్ట్యా జగన్ నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఏ జిల్లాల్లో ఎవరెవరికి కేబినెట్ బెర్త్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది..
శ్రీకాకుళం జిల్లా నుంచి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు మంత్రివర్గంలో చోటు ఖాయం. కుల సమీకరణాలు తెరపైకి వస్తే మరో సీనియర్ లీడర్ తమ్మినేనికి అవకాశం దక్కవచ్చు. విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ తప్ప రేసులో మరెవరూ లేరు. కోట్లగట్ల వీరభద్రస్వామి లాంటి ఒకరిద్దరి పేర్లు వినిపిస్తున్నా.. చివరి వరకూ ఆ పేర్లు పరిశీలనలో ఉంటాయని చెప్పలేం. విశాఖ జిల్లాలో గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ మధ్య పోటీ ఉంది. వీరిలో అమర్నాథ్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. జగన్కు బాగా సన్నిహితుడు కావడం ఆయనకు ప్లస్ పాయింట్. తూర్పుగోదావరి జిల్లా నుంచి కన్నబాబు, జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్ వంటి పేర్లు పరిశీలనకు వచ్చే ఛాన్స్ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆళ్లనాని, తానేటి వనిత, తెల్లం బాలరాజు, ప్రసాదరాజు బరిలో ఉన్నారు. అయితే ఉభయగోదావరి జిల్లాలో కులాల ఈక్వేషన్స్ కీరోల్ పోషించే అవకాశం ఉంది. జిల్లాలో పాదయాత్ర సమయంలో వెన్నంటి ఉన్న నాని.. పార్టీలో మొదటి నుంచి కొనసాగిన ప్రసాదరాజు ఇలా.. ప్రతి ఒక్కరికీ చెప్పుకోవడానికి కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి..
కృష్ణా జిల్లా నుంచి రేసులో కొడాలి నాని, పార్దసారథి, సామినేని ఉదయభాను, పేర్నినాని పేర్లు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మేరుగ నాగార్జున, కోన రఘుపతి పోటీలో ఉన్నారు. మరొకరికి కూడా జగన్ హామీ ఇచ్చినా ఆ సమీకరణాలన్నీ విస్తరణలోనో, పునర్వ్యవస్థీకరణలోనో తర్వాతెప్పుడైనా ఉండొచ్చు. గుంటూరు జిల్లా నుంచి సీనియర్ల మధ్య పోటీ ఎక్కువగా ఉన్నందున.. జగన్ ఏయే అంశాలు లెక్కలోకి తీసుకుని ఎవరెవరికి అవకాశం ఇస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి, మహీధర్ రెడ్డి, అన్నా రాంబాబు రేసులో ఉన్నారు. నెల్లూరు జిల్లా నుంచి మేకపాటి గౌతంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కాకాని గోవర్దన్ రెడ్డి, మాజీ ఎంపీ వరప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీళ్లంతా కూడా హేమాహేమీలే కావడంతో ఎవరికి అమాత్యయోగం దక్కుతుందన్నది వేచి చూడాలి..
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భామన కరుణాకర్ రెడ్డి, రోజా పేర్లను పరిగణలోకి తీసుకోవచ్చు. కడప నుంచి అంజాద్ బాషా, శ్రీకాంత్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. జగన్ కూడా వైఎస్సార్ ఈక్వేషన్ ఫాలో అవుతూ కడప నుంచి మైనార్టీలకు అవకాశం ఇస్తారా లేదంటే మరొకరిని మంత్రిని చేస్తారా అన్నది వేచి చూడాలి. కర్నులు జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కేబినెట్ బెర్త్ ఖాయం. అనంతపురం జిల్లాలో అనంత వెంకట్రామిరెడ్డికి ఛాన్స్ దక్కవచ్చు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒకచోట వాల్మీకి వర్గానికి కూడా అవకాశం ఉంది.చిత్తూరు జిల్లాలో ఎంపిక కాస్త కష్టంగానే ఉండొచ్చు.. సీనియర్ నేత పెద్దిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకొని భూమన, చెవిరెడ్డి, రోజా వంటి నేతలకు మిగతా చోట్ల సర్దుబాటు చేయొచ్చన్న వాదన వినిపిస్తోంది..
సామాజిక వర్గాల పరంగా చూస్తే వైశ్య కోటాలో ప్రకాశం జిల్లా నుంచి అన్నా రాంబాబు, కృష్ణా నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయనగరం జిల్లా నుంచి కోలగట్ల వీరభద్రస్వామిల మధ్య ప్రధాన పోటీ ఉంది. ఐతే.. జగన్ గతంలోనే వెల్లంపల్లికి మంత్రి పదవిపై హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే బ్రాహ్మణులకు ఛాన్స్ ఇస్తే కోన రఘుపతి, మల్లాది విష్ణుల మధ్య పోటీ ఉంటుంది. కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక్క కొడాలి నానికే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. యాదవ సామాజికవర్గం నుంచి పార్దసారథికి మంత్రి పదవి ఖాయమే. అనిల్ కుమార్ యాదవ్, మధుసూధన్ యాదవ్ మధ్య కూడా పోటీ ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రుల ఎంపిక ఆయా జిల్లాల్లో ఇతర కులాల సీనియర్ల ఎంపికపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
శ్రీకాకుళం జిల్లా: ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం.
విజయనగరం జిల్లా: బొత్స సత్యనారాయణ.
విశాఖ జిల్లా: అమర్ నాథ్, అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ.
తూర్పుగోదావరి జిల్లా: కన్నబాబు, జక్కంపూడి రాజా, పిల్లిసుభాష్ చంద్రబోస్, విశ్వరూప్.
పశ్చిమ గోదావరి జిల్లా: ఆళ్లనాని, తానేటి వనిత, తెల్లం బాలరాజు, ప్రసాదరాజు.
కృష్ణా జిల్లా: కొడాలి నాని, పార్దసారథి, సామినేని ఉదయభాను, పేర్నినాని.
గుంటూరు జిల్లా: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మేరుగ నాగార్జున, కోన రఘుపతి.
ప్రకాశం జిల్లా: బాలినేని శ్రీనివాసరెడ్డి, మహీధర్ రెడ్డి, అన్నా రాంబాబు.
నెల్లూరు జిల్లా: మేకపాటి గౌతంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కాకాని గోవర్దన్ రెడ్డి
మాజీ ఎంపీ వరప్రసాద్.
చిత్తూరు జిల్లా: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భామన కరుణాకర్ రెడ్డి, రోజా.
కడప జిల్లా: అంజాద్ బాషా, శ్రీకాంత్ రెడ్డి.
కర్నూలు జిల్లా: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
అనంతపురం జిల్లా: అనంత వెంకట్రామిరెడ్డి.
వైశ్య సామాజిక వర్గం: అన్నా రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, కోలగట్ల వీరభద్రస్వామి.
బ్రాహ్మణ సామాజిక వర్గం: కోన రఘుపతి, మల్లాది విష్ణు.
కమ్మ సామాజిక వర్గం: కొడాలి నాని.
యాదవ సామాజిక వర్గం: పార్దసారథి, అనిల్ కుమార్ యాదవ్ , మధుసూధన్ యాదవ్.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ లేకుండా ప్రయాణించిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సిబ్బంది
- ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు
- దుబాయ్ ఆర్టీఏ బస్సు ఉల్లంఘనలు.. జరిమానాల జాబితా
- నితాఖత్ కింద సౌదీలుగా ఫారీన్ ఇన్వెస్టర్లు
- డొమెస్టిక్ లేబర్ ప్రొబేషన్ వ్యవధి 6 నెలలకు పెంపు..!
- అబుదాబిలోని అత్యంత ఖరీదైన పెంట్హౌస్ సేల్
- కువైట్ లో పెరుగుతున్న ఎలక్ట్రికల్ లోడ్ ఇండెక్స్..!
- ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అప్లికేషన్లలో 12.59% పెరుగుదల
- హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం: ఈడీ