విజయ్ దేవరకొండతో నమ్రత..

- June 05, 2019 , by Maagulf
విజయ్ దేవరకొండతో నమ్రత..

సూపర్ స్టార్ మహేష్ బాబుతో పెళ్లైన తరువాత సినిమాలకు దూరమైంది నమ్రతా శిరోద్కర్. ఇద్దరు బిడ్డలకు తల్లై ఓ మంచి అమ్మగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ, తమ బిజినెస్‌లకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూ బిజీగానే గడిపేస్తుంటారు. నమ్రత, మహేష్‌లు కలిసి ఏఎంబీ సినిమాస్ పేరిట భారీ మల్టీప్లెక్స్ ఒకటి, అలాగే జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. తమ సొంత బ్యానర్‌పై రూపొందించే సినిమాల విషయంలో నమ్రత ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటుంది. తాజాగా విజయ్ దేవరకొండతో ఓ చిత్రాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. ఆయనతో సినిమా చేసి హిట్ కొట్టాలన్నది నమ్రత ప్లాన్. మహేష్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ని తమ బ్యానర్‌లో నిర్మిస్తూనే ఇతర హీరోలను కూడా పరిచయం చేయాలనుకుంటోంది నమ్రత. అడవి శేష్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఆ తరువాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో మరో సినిమా. ఇక నమ్రత, విజయ్ దేవరకొండల ప్రాజెక్ట్ తెరకెక్కాలంటే చాలా రోజులు పట్టేలానే ఉంది. విజయ్‌కి ఇప్పటికే దర్శకుడు క్రాంతి మాధవ్‌తో ఓ సినిమాకి, తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో మరో సినిమాకు సైన్ చేసి ఉన్నాడు. ఈ రెండూ పూర్తయ్యాక కానీ నమ్రత సినిమా పట్టాలెక్కనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com