మీడియా పై భారం మోపుతున్న మోడీ ప్రభుత్వం

- July 12, 2019 , by Maagulf
మీడియా పై భారం మోపుతున్న మోడీ ప్రభుత్వం

రెండో దఫా భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనదైన శైలిలో దూకుడు నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారని అంటున్నారు. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో తొలి, పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన మోడీ ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వార్తాపత్రికల ప్రచురణకు అవసరమయ్యే న్యూస్‌ప్రింట్‌పై 10 శాతం కస్టమ్స్‌ సుంకాన్ని విధించింది. ఈ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలను నేరుగా టార్గెట్ చేసిన మోడీ పాలన ఇప్పుడు పత్రికలన్నింటికీ దిమ్మతిరిగే షాకిచ్చారని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వార్తాపత్రికల ప్రచురణకు అవసరమయ్యే న్యూస్‌ప్రింట్‌పై 10 శాతం కస్టమ్స్‌ సుంకాన్ని విధించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న అన్‌కోటెడ్‌, లైట్‌కోటెడ్‌ పేపర్‌లపై 10 శాతం కస్టమ్స్‌ సుంకం విధించాలని సర్కారు నిర్ణయంతో పత్రికల నిర్వహణ మరింత భారం కానుంది.

వార్తాపత్రికలకు అన్‌కోటెడ్‌ పేపర్‌ను, మ్యాగజైన్‌లకు లైట్‌కోటెడ్‌ పేపర్‌ను వాడుతారు. కాగా దీనిపై సుంకం విధించడం బాధాకరమనీ, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ మేగజీన్స్‌ (ఏఐఎం) డిమాండ్‌ చేసింది. న్యూస్‌ప్రింట్‌పై కస్టమ్స్‌ సుంకాలు విధిస్తే పత్రికా నిర్వహణ దాదాపు రెండింతలు అవుతుందని ఏఐఎం ఆందోళన వ్యక్తం చేసింది.

ఇప్పటికే వార్తా ప్రచురణ చాలా ఇబ్బందుల్లో ఉందనీ, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయి ఆర్థికంగా చితికిపోతున్న పత్రికా నిర్వహణను మరింత కష్టాల్లోకి నెట్టొద్దని పేర్కొంది. చిన్న, మధ్య తరహా పత్రికలు మూసివేత దిశకు చేరుకున్నాయనీ.. ఈ సమయంలో మూలిగే నక్క మీద తాటి పండు పడిన చందంగా న్యూస్‌ప్రింట్‌పై కస్టమ్స్‌ విధించే నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని కోరింది.

కేంద్రం వాదన మరోలా ఉంది. 'మేకిన్‌ ఇండియా'ను ప్రోత్సహించడానికే విదేశాల నుంచి దిగుమతయ్యే పేపర్‌పై సుంకం విధిస్తున్నామని మోడీ సర్కారు చెబుతోంది. అయితే, 'మేకిన్‌ ఇండియా'లో భాగంగా దేశీయ పేపర్‌ పరిశ్రమలను ప్రోత్సహించడానికే అని చెబుతున్నా.. దీనివెనుక చిన్న పత్రికలను మూసేయించాలనే కుట్ర దాగి ఉందని చిన్న, మధ్య తరహా పత్రికా యజమానులు ఆరోపిస్తున్నారు. భారతీయ వార్తా పత్రికలకు వార్షికంగా 25 లక్షల టన్నుల న్యూస్‌ప్రింట్‌ అవసరం. కానీ దేశీయంగా పది లక్షల టన్నుల పేపర్‌ కూడా ఉత్పత్తి కావడం లేదు. అంతేగాక దేశంలో తయారయ్యే న్యూస్‌ప్రింట్‌.. పత్రికల ప్రచురణకు అనుకూలంగా ఉండదని ఇండియన్‌ న్యూస్‌పేపర్స్‌ సొసైటీ (ఐఎన్ఎస్‌) తెలిపింది. అసలు ఇక్కడ అన్‌కోటెడ్‌, లైట్‌కోటెడ్‌ పేపర్‌ ఉత్పత్తి కావడం లేదని అది ఆరోపించింది.

ఇదిలాఉండగా, గత కొంతకాలంగా తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే నెపంతో మోడీ సర్కారు ఇటీవలే మూడు ప్రధాన మీడియా హౌజ్‌ (టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ది హిందూ, టెలిగ్రాఫ్‌)లకు ప్రభుత్వ ప్రకటనలను నిలిపివేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే న్యూస్‌ప్రింట్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని పదిశాతానికి పెంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలను మరుగున పడేసి తమకు అనుకూల వార్తలను మాత్రమే ప్రసారం చేయించుకోవాలనే కుట్రలో భాగంగానే కస్టమ్స్‌ సుంకాలను పెంచారని వారు విమర్శిస్తున్నారు. డిజిటల్‌ ఎడిషన్లు, ఈ-పేపర్‌లతో పత్రికల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో కస్టమ్స్‌ సుంకం మరింత ప్రమాదంలోకి నెట్టిందంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com