విశాఖ హార్బర్‌లో అగ్నిప్రమాదం

- August 12, 2019 , by Maagulf
విశాఖ హార్బర్‌లో అగ్నిప్రమాదం

విశాఖ:విశాఖ ఔటర్‌ హార్బర్‌లోని టగ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  దాదాపు 70శాతం వరకు ఆ టగ్‌ తగలబడింది. నౌకలో సివిల్‌ పనుల కోసం సిబ్బందిని తరలిస్తుండగా టగ్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురై సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. వారి ఆర్తనాదాలు గమనించిన కోస్ట్‌గార్డు సిబ్బంది అప్రమత్తమై వారిని ఓడ్డుకు చేర్చారు. ప్రమాదం సమయంలో టగ్‌లో 29 మంది సిబ్బంది ఉండగా.. 28 మందిని రక్షించారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన టగ్‌ను జాగ్వార్‌గా గుర్తించారు. చమురు నౌకల్ని బెర్త్‌ వద్దకు తీసుకురావడం, నౌకలో సిబ్బంది సేవల కోసం ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌పీసీఎల్‌ ఈ టగ్‌ను అద్దెకు తీసుకున్నట్టు సమాచారం.


ఏడుగురి పరిస్థితి విషమం...
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఏసీపీ కులశేఖర్‌ వెల్లడించారు. మిగతా ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు. హెచ్‌పీసీఎల్‌కు చమురు పైపు అనుసంధానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు ఏసీపీ తెలిపారు. సహాయక చర్యల్లో రాణి రోష్మణి, చార్లి సీ432 నౌకలు పాల్గొన్నాయని కోస్టు గార్డు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com