నా ఐరోపా యాత్ర - 4 (పోలాండ్)

- March 11, 2016 , by Maagulf
 

మింజు జేర్జ్ లో ఇంటి అద్దెలు తక్కువే, మన డబ్బుల్లో 25000 పెడితే రెండుగదుల విలాసవంతమైన ఫ్లాట్ దొరుకుతుంది. నాకు మా సంస్థే అన్ని ఏర్పాట్లు చెయ్యటం వల్ల ఆ ఖర్చు లేదు. TESCO అనేది ఇక్కడ అతిపెద్ద హైపర్ మార్కెట్. బ్రిటన్ కి చెందిన ఈ గొలుసుకట్టు చిల్లర వాణిజ్య సంస్థ మన దేశంలో FDI ల పుణ్యమా అని త్వరలో భారత దేశంలో  అన్ని ప్రాంతాల్లో తమ స్టోర్ లని తెరవనుంది. దీనితోపాటు పోలాండ్ దేశానికే చెందిన పలు సూపర్ మార్కెట్లు కూడా మింజు జేర్జ్ లో ఉన్నాయి. మన రాష్ట్రంలో స్పెషల్ ఎకనామిక్ జోన్ లాగే ఇక్కడి ప్రభుత్వం కూడా ఒక మాదిరి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పారిశ్రామిక వాడలని కేటాయించింది. అందులో మింజు జేర్జ్ కూడా ఒకటి. స్థానికులకి ఉపాధి కల్పనే వీటి వెనుక ధ్యేయం. దీనివల్ల సిటీలకి వలసలు తగ్గుతాయి. ఉన్న ఊర్లోనే ఉద్యోగం ఉండటంతో స్థానికులకి మంచి జీవితం. గ్రామీణ ప్రాంతాల్లో కంపెనీల నిర్వహణ వ్యయం కూడా తక్కువే. జర్మనీ కి దగ్గరగా ఉండటం ఈ ప్రాంతానికి బాగా కలిసి వచ్చిన అంశం. యూరప్ లో ఉద్యోగులు చాలా ఖరీదు. వ్యాపారాల్లో చిన్న చిన్న పనులకి మనుషుల్ని నియమిస్తే వారి జీతం కూడా రాదు. అందుకే చాలా వరకు వెండింగ్ మిషన్లే కనిపిస్తాయి.ఇక్కడి ప్రజలు కాఫీ ప్రియులు, ఏ దుకాణానికి గాని షాపింగ్ మాల్ కి వెళ్ళినా కాఫీ వాసన ఘుమఘుమలాడుతూ ఉంటుంది. ఇక్కడి పెట్రోల్ బంకుల్లో ఎవరికి వారే పెట్రోల్ నింపుకోవాలి. తర్వాత అక్కడ ఉన్న కౌంటర్ కి వెళ్లి నగదు చెల్లించాలి. పెట్రోల్ బంకుల్లో పెద్ద పెద్ద క్యూ లు ఏమీ ఉండవు కాబట్టి ఈ ప్రక్రియ బాగానే ఉంది.మోసాలు, దొంగతనాలు అనేవి వారికి తెలియని పదాలు. ఇక్కడ ఉన్న పెట్రోల్ బంకుల్లో  సూపర్ మార్కెట్, కాఫీ షాప్, వాష్ రూమ్స్ తప్పని సరిగా ఉంటాయి. పోలాండ్ లో ప్రతి ఇంటికి ఒక పెంపుడు జంతువు తప్పనిసరిగా ఉంటుంది. సహజీవనం చేసే జంటలు ఎక్కువే, పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనేవారు ఉన్నారు. కాని పెళ్లి చేసుకుంటే మాత్రం ఆ బంధానికి విలువ ఇస్తారు. చాలామంది సహజీవనం చేసేటపుడే విడిపోతారు కాబట్టి పెళ్లి అయ్యాక విడాకులు అనేవి పెద్దగా ఉండవు. మన దేశంలో ఉన్న అరేంజ్డ్ మారేజ్ విధానం వీరికొక పెద్ద వింత. అమ్మాయిని అసలు పరిచయం లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటారు అనేది వీరికొక పెద్ద పజిల్. నేను మొట్ట మొదటగా పోలాండ్ లో సందర్శించిన ప్రదేశం బంకర్స్.

 

మింజు జేర్జ్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో బెర్లిన్ వెళ్ళే దారిలో ఈ బంకర్స్ ఉన్నాయి. తోటి భారతీయ మిత్రులు మరియు అక్కడి స్థానిక మిత్రుడితో కలిసి అవి చూడటానికి వెళ్ళాం. మొట్ట మొదటిసారి రెండవ ప్రపంచ యుద్ధం గురించి, హిట్లర్ గురించి విన్నది అక్కడే. జ్యూయిష్ అనే ఒక మతం ఉందని, వారినే యూదులు అంటారని అప్పుడే తెలిసింది. రెండవ ప్రపంచ యుద్ధంలో పోలాండ్ పశ్చిమ భాగాన్ని రష్యా, తూర్పు భాగాన్ని జర్మనీ ఆక్రమించుకున్నాయి. రష్యా సైన్యం జర్మనీ ని ఆక్రమించాలంటే ఈ దారి గుండానే వెళ్ళాలి. వారిని నియంత్రించటం కోసం సరిహద్దులో భూమిలో 300 అడుగుల లోతున ఈ బంకర్ ని నిర్మించారు. దీని మొత్తం పొడవు 32 కిలోమీటర్లు. కాని కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే సందర్శనీయ ప్రాంతంగా ఉంది. అక్కడ ఇంగ్లీష్ గైడ్ కావాలంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. స్థానిక మిత్రుడు ముందుగానే ఏర్పాట్లు చెయ్యటంతో అప్పటికే మాకోసం ఎదురు చూస్తున్న గైడ్ సహాయంతో బంకర్ లోపలకి వెళ్ళాం. అతి ఇరుకైన తలుపు గుండా కిందకి 300 మీటర్లు మెట్లు దిగాక పొడవాటి వీధులు ఉన్న నిర్మాణంలోకి ప్రవేశించాం. లోపల ఉష్ణోగ్రత - 5 డిగ్రీలు. లోపల సైనికులు ప్రయాణించటానికి చిన్న ట్రైన్ కూడా ఉంది.అప్పుడు నాజీ సైనికులు వాడిన టూత్ పేస్టు, బూట్లు,టెలిఫోను, రేడియో ఇప్పటికీ అలాగే ఉంచారు.

 

అసలు అది 1940 లో కట్టిన నిర్మాణం అనిపించలా, పటిష్టమైన గోడలు, ఎక్కడా చెక్కు చెదరని ఈ నిర్మాణాన్ని ఒక క్రమ పద్దతి లో ప్రణాళికా బద్ధంగా నిర్మించారు. హిట్లర్ యుద్ధాన్ని ఒక పరిశ్రమ లాగే భావించాడు. దానికి తగ్గట్టే యుద్ధానికి అవసరమైనవి అన్నీ శాశ్వత ప్రాతిపదికనే నిర్మించాడు. అత్యాధునిక యుద్ధ సామాగ్రిని ఆ రోజుల్లోనే సమకూర్చుకున్నాడు. యుద్ధం కోసం రోడ్లు వేసారు, మనుషుల్ని చంపటానికి కాన్ సన్ ట్రేషన్ కాంపుల పేరుతో మృత్యు కుహరాలని నిర్మించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక కాని రష్యన్ రెడ్ ఆర్మీ ఈ బంకర్ని చేరుకోలేదు. ఇందులో ఏమైనా సంపద దాచారేమో అని అక్కడక్కడా రెడ్ ఆర్మీ దీనిని ధ్వంసం చేసింది. అందుకే లోపల గోడలకి అక్కడక్కడా రంద్రాలు, బులెట్ గుర్తులు ఉన్నాయి. ఈ బంకర్ ఉన్నంత మేరా భూమి పైన డ్రాగన్ వే ఉంటుంది. యుద్ధ టాంకర్లు ఈ సరిహద్దుని దాటకుండా కొంత ఎత్తులో సిమెంట్ దిమ్మలు నిర్మించారు.

 

రష్యా సైన్యం ఈ దారిని వినియోగించకపోవటంతో ఈ బంకర్ నిర్మించిన ఉద్దేశం సఫలీకృతం కాలేదు. దీని నిర్మాణం జరుగుతున్నపుడు హిట్లర్ ఇక్కడికి వచ్చాడని గైడ్ చెప్పాడు. ఈ బంకర్ లో కొన్నాళ్ళు నాజీ సైనికుల కాంప్ ఉండేది. యుద్ధం ముగిసి జర్మనీ ఓడిపోయాక ఇందులో ఉన్న సైనికులంతా చెల్లా చెదురుగా పారిపోయారు. పోలాండ్ లో జర్మనీ ఆక్రమిత భాగాన్ని కూడా రష్యా ఆక్రమించుకుంది. 1989 లో కమ్యూనిస్టు పాలన అంతమై సోవియట్ యూనియన్ ముక్కలయ్యేవరకు పోలాండ్ దేశం రష్యా ఆధీనంలోనే ఉంది. ఇవన్నీ విషయాలు గైడ్ చెప్తుంటే తలపంకించి వింటూ ఉండిపోయాను. నా అసలు అన్వేషణ అప్పుడే మొదలైంది. అసలు యుద్ధం ఎందుకొచ్చింది? ఈ హిట్లర్ ఎవరు ? యూదుల్ని ఎందుకు అంత క్రూరంగా చంపాడు ? నాజీలంటే ఎవరు ? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కొంత హిట్లర్ గురించి పరిచయం అవసరం. అసలు సిసలు జాత్యహంకారానికి ప్రతిరూపం హిట్లర్, మానవత్వం లేకుండా సాటి మనుషుల్ని డెత్ ఫాక్టరీల్లొ అమానుషంగా చంపిన నాజీల కధ తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com