నా ఐరోపా యాత్ర - 5 (పోలాండ్)

- March 17, 2016 , by Maagulf
 

 

నేను ఎంతోమంది గొప్పవాళ్ళ ఆటో బయోగ్రఫీలని చదివాను. జీవితంలో వారి ప్రతి లక్ష్యం వెనుక ఒక ఆశయం కనపడింది. అది వారికైనా మేలు చేసేది,లేక సమాజానికైనా మేలు చేసేదిగా ఉండేది. నాకు అర్ధం కానిది, నాకు ఇప్పటికీ అంతు చిక్కనిది హిట్లర్ జీవితం, అతని ఆశయం. నియంతృత్వంతో ప్రపంచాధిపత్యం సాధించాలనే కోరికతో ఎంతోమంది యుద్ధ పిపాసులు నియంతలుగా అవతరించారు. తన సిద్ధాంతాలతో ఏకీభవించని వారిని మట్టు బెడుతూ మాత్రమే వారు నియంతృత్వంతో వ్యవహరించారు. కాని ఎవరూ లక్ష్యాన్ని చేరుకోకుండానే మరణించారు. కాని అలాంటి వారికి భిన్నమైన మనస్తత్వం హిట్లర్ ది. తనతో ఏకీభవించని వారిని మాత్రమే కాకుండా, అసలు తనకు ఏమాత్రం సంభంధం లేని యూదులు, జెర్మనీ అభివృద్ధి కి ఆటంకాలుగా ఉన్నారనే అసత్య ఆరోపణలతో, జర్మనీ నుండి యూదుల నిర్మూలనే నా లక్ష్యం అనే నినాదంతో పార్టీని స్థాపించి, ప్రజల మధ్య జాతి విద్వేషాలని రెచ్చగొట్టి తాను అధికారంలోకి వచ్చాక 60 లక్షలమంది యూదులని అత్యంత కిరాతంగా మట్టుబెట్టాడు. చాలామందికి హిట్లర్ అంటే నియంతగా మాత్రమే తెలుసు. కాని తెలియని మరో కోణం ఈ యూదు విద్వేషం, జాత్యహంకారం.

 

మొదటి ప్రపంచ యుద్ధం 

 

యూరప్ లో ఉన్న సెర్బియా దేశస్థుడు తమ దేశపు వ్యక్తిని హత్య చేయటంతో ఆస్ట్రియా, హంగరీ ఆ దేశంపై యుద్ధం ప్రకటించాయి. ఆ యుద్ధం పెరిగి సెర్బియాకి మద్దతుగా ప్రపంచంలో 28 దేశాలు ఆ యుద్ధంలో పాల్గొన్నాయి. వీటిలో ముఖ్యమైనవి అమెరికా,బ్రిటన్ ,ఫ్రాన్స్ . వాటికి ప్రత్యర్ధులుగా జర్మనీ, ఆస్ట్రియా ,హంగరీ, బల్గేరియా అక్షరాజ్యాలుగా అవతరించాయి. ఈ మిత్ర రాజ్యాలు,అక్ష రాజ్యాల మధ్య జరిగిన యుద్ధమే మొదటి ప్రపంచ యుద్ధం. 1918 వరకు యుద్ధం జరిగింది. ఎంతో ప్రాణ నష్టం , ధన నష్టం జరిగింది. జర్మనీ ఆర్ధికంగా చితికిపోయింది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన వెయిమర్ రిపబ్లిక్ ప్రభుత్వం యూదులకి స్వేచ్చనిచ్చింది. వారు ఆర్ధికంగా సంక్షోభంలో ఉన్న జర్మనీ ని గాడిలో పెడతారని నమ్మింది. యూదులు మంచి వ్యాపార దక్షత కలవారు. వీరు అంతర్జాతీయ బాంకర్లుగా కూడా పిలవబడ్డారు. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ యూదు మేధావి. ఈ కాలంలోనే థియరీ ఆఫ్ రిలేటివిటీని ఆవిష్కరించాడు. జర్మనీకి గర్వకారణం అంటూ వెయిమర్ ప్రభుత్వం ఆయన్ని కీర్తించింది. కాని జర్మనీ కి కాలం కలిసి రాలేదు. యుద్ధంలో ఓడిపోవటంతో గెలిచిన దేశాలు తమకు జరిగిన నష్టానికి పరిహారం కట్టమన్నాయి. దీనిని వేర్సైల్స్ సంధి అంటారు. ఫ్రాన్సు లో ఉన్న వేర్సైల్స్ రాజ ప్రాసాదంలో ఈ ఒడంబడిక జరిగింది. ఈ దెబ్బతో జర్మనీ ఆర్ధికంగా కుదేలయింది.డబ్బు కట్టటం కోసం కరెన్సీ అధికంగా ముద్రించారు. దీని వల్ల దేశ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారింది. ఇక డబ్బు కట్టలేమని జర్మనీ చేతులెత్తేయటంతో ఫ్రాన్సు ఆ దేశపు బొగ్గు పరిశ్రమ ని స్వాధీనం చేసుకుంది. 1929 నాటికి దేశంలో The great Depression మొదలైంది. సరిగ్గా ఆ సమయంలో జర్మన్స్ కి దేవుడిలా కనపడ్డాడు అడాల్ఫ్ హిట్లర్.

 

 అడాల్ఫ్ హిట్లర్ ఏప్రిల్ 20, 1889 న బ్రౌనౌ అం ఇన్ అనే గ్రామంలో ఆస్ట్రియా దేశంలో జన్మించాడు ఈ గ్రామం ఎగువ ఆస్ట్రియా, జర్మనీ దేశ సరిహద్దులలో ఉంది. ఆరుగురు పిల్లలలో హిట్లర్ నాలుగోవవాడు మరియు మూడవ మగ బిడ్డ. హిట్లర్ తండ్రి అలోఇస్ హిట్లర్ (అసలు పేరు శ్చిక్క్ల్ గ్రుబర్) వాణిజ్య శాఖలో గుమాస్తా. హిట్లర్ తల్లి క్లారా పోల్జ్ (1860–1907), అలోఇస్ కు రెండవ మరదలు మరియు మూడవ భార్య. వీరికి కలిగిన ఆరుగురు సంతనంలో హిట్లర్ మరియు అతని చెల్లెలు పౌలా మాత్రమే బతికారు. అలోఇస్ జూనియర్, ఏంజెలా, ఈ ఇద్దరు అలోఇస్ కు రెండవ భార్య వలన కలిగిన సంతానం. అలోఇస్ మొదటి భార్యకు పిల్లలు లేరు. అలోఇస్ హిట్లర్ (హిట్లర్ తండ్రి) ఆక్రమ సంతానం. తన జీవితపు తొలి 39 సంవత్సరాలు అతడు తన తల్లి ఇంటి పేరునే తన ఇంటి పేరుగా చేర్చుకున్నాడు. 1876 లో జనాభా లెక్కల ప్రకారం ఒక గుమస్తా ఇతని సవతి తండ్రి 'జోహాన్న్ గెఒర్గ్ హైడ్లార్' ను అలోఇస్ తండ్రిగా పేర్కొన్నాడు. ఆ పేరు రకరకాలుగా పిలవబడి చివరకు 'హిట్లర్' గా స్థిరపడింది. పురాతన జర్మన్ భాషలో 'హిట్లర్' అంటే గుడిశె లో నివసించే వాడని అర్థం. యుక్త వయసు వచ్చేనాటికి సరిహద్దు అధికారుల కళ్లుగప్పి జర్మనీ లోకి ప్రవేశించాడు. హిట్లర్ గొప్ప చిత్రకారుడు,కొన్నాళ్ళు  రోడ్డు మీద రక రకాల ;బొమ్మలు వేసి పొట్ట పోసుకున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యం లో చేరాడు. యుద్ధ మెళకువల్ని రాజకీయాలని అక్కడే వంటబట్టిన్చుకున్నాడు. 1918 లో జర్మనీ యుద్ధంలో ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేక పోయాడు.ఆ ఓటమికి యూదులే కారణం అని వారి మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు.1920 లో అప్పటికే ఉన్న సోషలిస్ట్ పార్టీలో చేరి దానికి నాయకుడయ్యాడు. దాని పేరుని నేషనల్ సోషలిస్ట్ పార్టీ గా మార్చాడు.దీనినే క్లుప్తంగా నాజీ పార్టీ అన్నారు.దీనికి పనిచేసిన సైన్యం నాజీలుగా పిలవబడ్డారు.  పార్టీ గుర్తుగా స్వస్తిక్ ని హిట్లర్ రూపొందించాడు.పార్టీ అన్నీ తానై వ్యవహరించాడు.జర్మన్స్ అంటే ఆర్య జాతికి చెందిన వారని, వారికి మాత్రమె ప్రపంచాన్ని ఏలగల సత్తా ఉందని ప్రజలలో ప్రచారం చేశాడు.జర్మన్స్  మాత్రమే జర్మనీ లో ఉండాలని పిలుపునిచ్చాడు. 1923 లో అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన సైన్యాన్ని కవాతు చేయించాడు. ఇది ఒక బీర్ హాల్ దగ్గర జరగటంతో చరిత్ర లో ఇది బీర్ హాల్ పుష్ గా పిలిచారు.

 

ఇందుకుగాను అప్పటి ప్రభుత్వం హిట్లర్ ని అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. ఆ సమయాన్ని హిట్లర్ వృధా చేసుకోలేదు. ది మెయిన్ కాంఫ్ అనే పుస్తకాన్ని రాసాడు. జర్మనీ ఎలా ఉండాలో తాను ఎలాంటి జర్మనీ ని చూడాలనుకుంటున్నాడో అందులో రాసాడు. జర్మనీ వాసులు ఆర్యజాతి అని మిగతా వాళ్ళంతా సెమిటిక్ జాతులు గా వర్ణించాడు. ఆర్యులు మాత్రమే గొప్పజాతిగా ఉండాలని,ప్రపంచాన్ని ఏలాలని ఉద్బొదించాడు. ఆ పుస్తకం 1925 నాటికి  240000 కాపీలు అమ్ముడు పోయింది.యుద్ధం ముగిసే నాటికి 10 లక్షల కాపీలు అమ్ముడు పోయిందని ఒక అంచనా.1924 లో జైలు నుండి విడుదలయ్యాక నాజీ పార్టీని మరింత బలోపేతం చెయ్యటం మొదలు పెట్టాడు. 1929 మొదలైన సంక్షోభం 1933 నాటికి తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ సమయంలో హిట్లర్ ఆవేశ పూరిత ప్రసంగాలు జర్మనీ ప్రజలని ఆకట్టుకున్నాయి. యూదులు లేని జర్మనీ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తానని నాజీల చేత చేయించిన ప్రతిజ్ఞలు జర్మనీ వాసుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. హిట్లర్ జర్మనీ రక్షకుడుగా వారికి కనిపించాడు. 1933 ఎన్నికలలో మెజారిటీ కూడగట్టుకున్న హిట్లర్,1934 నాటికి దేశాధ్యక్షుడు హిండెన్ బర్గ్ మరణించటంతో పూర్తి స్థాయి జర్మనీ అధ్యక్షుడుగా అవతరించాడు.ఇక అక్కడ్నుంచే యూదులకి, జర్మనేతర జాతులకి కష్టాలు మొదలయ్యాయి. యూదుల వ్యాపారాల్ని నిషేదించారు. వారు నగరాల మధ్యలో ఉండకూడదని ఆంక్షలు విధించారు. అసలు ఈ యూదులంటే ఎవరు? ఎందుకు జర్మనీలో ఉన్నారు ? హిట్లర్ కి వాళ్ళంటే ఎందుకు అంత కోపం? 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com