మార్కెట్ లోకి రూ.500 ప్లాస్టిక్ నోట్లు? RBI క్లారిటీ

- June 09, 2026 , by Maagulf
మార్కెట్ లోకి రూ.500 ప్లాస్టిక్ నోట్లు? RBI క్లారిటీ

ముంబై: దేశంలో త్వరలోనే కొత్తగా రూ.500 ప్లాస్టిక్ నోట్లు మార్కెట్లోకి రాబోతున్నాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికల్లో ఒక వార్త విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ఈ ప్లాస్టిక్ నోట్లు జూన్ 30వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అధికారికంగా చలామణిలోకి వస్తాయంటూ కొందరు నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు షేర్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా, ఆ నోట్లపై ఎప్పటి నుంచో వస్తున్న మహాత్మా గాంధీ చిత్రం లేకుండా, కేవలం భారత జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని మాత్రమే ముద్రించినట్లు ఉన్న కొన్ని ఫొటోలను కూడా ఆయా పోస్టులకు జత చేశారు.దీంతో సామాన్య ప్రజలు, వ్యాపారస్తులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. మళ్లీ దేశంలో నోట్ల రద్దు లాంటి ప్రక్రియ ఏమైనా జరగబోతుందా అని సోషల్ మీడియా వేదికగా చర్చలు మొదలుపెట్టారు.

నిజం వెల్లడించిన ఫ్యాక్ట్ చెక్–ఏఐ (AI) సృష్టించిన నకిలీ చిత్రం

ఈ వైరల్ వార్త పై ప్రముఖ ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థ ‘ఫ్యాక్ట్‌లీ’ (Factly) పరిశోధన జరిపి అసలు నిజాన్ని బయటపెట్టింది. సాషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ రూ. 500 ప్లాస్టిక్ నోట్ల ఫొటోలు ముమ్మాటికీ నకిలీవని తేల్చి చెప్పింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి ఎవరో ఆకతాయిలు ఈ అబద్ధపు ఫొటోలను సృష్టించారని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కానీ ఎలాంటి ప్లాస్టిక్ నోట్లను విడుదల చేయలేదని వెల్లడించింది. ఒకవేళ భారత ప్రభుత్వం అధికారికంగా కొత్త నోట్లను ముద్రించినా లేదా చలామణిలోకి తెచ్చినా.. ఆ సమాచారాన్ని మొదటగా ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే దేశ ప్రజలకు ప్రకటిస్తుందని గుర్తు చేసింది. కాబట్టి, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఇలాంటి నిరాధారమైన పుకార్లను ఎవరూ నమ్మవద్దని మరియు వాటిని ఇతరులకు షేర్ చేసి ప్రచారం చేయవద్దని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com