ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి

- March 04, 2026 , by Maagulf
ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి

ఇజ్రాయెల్-అమెరికాలతో యుద్ధం కొనసాగుతున్న వేళ శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌక పై దాడి చోటుచేసుకుంది. ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డెనాపై జరిగిన ఈ దాడిలో 100 మందికిపైగా గల్లంతు కాగా. మరో 72 మంది గాయపడ్డారు. ఈ దాడి గురించి శ్రీలంక నేవీ అధికారి వెల్లడించారు. బుధవారం తమ ప్రాదేశిక జలాల్లో దక్షిణంగా 25 మైళ్ల దూరంలో ఇరాన్ యుద్ధ నౌక మునిగిపోయినట్టు లంక విదేశాంగ మంత్రి విజితా హెరాత్ ధ్రువీకరించారు. నౌక మునిగిపోవడానికి గల కారణంపై వెంటనే ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు, కానీ గాయపడిన నావికులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు హెరాత్ పార్లమెంటుకు వెల్లడించారు.

గల్లంతైన నావికుల కోసం గాలింపు కొనసాగుతున్నట్టు శ్రీలంక రక్షణ శాఖ తెలిపింది. మిగతావారు ఏమయ్యారో తెలియరాదని పేర్కొంది. శ్రీలంక యుద్ధ నౌకలు, విమానాలను రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయని, నౌక మునిగిపోవడానికి కారణం ఏంటో తెలియరాలేదని చెప్పారు. ఈ యుద్ధ నౌక విశాఖలో జరిగిన ఐఎఫ్ఆర్, అంతర్జాతీయ పరిక్రమ్‌లో పాల్గొని, ఫిబ్రవరి 17న ఇరాన్‌కు బయలుదేరిందని రాయిటర్స్ పేర్కొంది. శ్రీలంకలోని గాలే మీదుగా వెళ్తుండగా దాడి జరిగినట్టు తెలిపింది.

ఇరాన్‌పై జరుగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో భాగంగానే ఈ నౌకపై బాంబు దాడి జరిగిందా? అని ప్రతిపక్ష సభ్యుడు ప్రశ్నించినా.. ప్రభుత్వం నుంచి తక్షణ స్పందన రాలేదు. శ్రీలంక ప్రాదేశిక జలాలకు అనుగుణంగా తమ ఆపరేషన్ జరిగిందని, రాజధాని కొలంబోకు 115 కిలోమీటర్లు (70 మైళ్లు) దక్షిణంగా ఉన్న గాలెలోని ప్రధాన ఆసుపత్రికి 32 మంది ఇరానియన్ నావికులను తరలించామని నేవీ ప్రతినిధి బుద్ధిక సంపత్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com