చేనేత రంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత: ఆర్.పి.సిసోడియా
- March 24, 2026
విజయవాడ: చేనేత రంగ అభివృద్ధి, సంరక్షణకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్.పి. సిసోడియా తెలిపారు. చేనేతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. స్థానిక జీఆర్టీ హోటల్లో నిర్వహించిన హ్యాండ్లూమ్ (రిజర్వేషన్ ఆఫ్ ఆర్టికల్స్) చట్టం, 1985 అమలు మరియు చేనేత పరిరక్షణపై అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం నగరాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
చట్టాల అమలు-అక్రమాల పై కఠిన చర్యలు
1985 హ్యాండ్లూమ్ చట్టం చేనేత కార్మికులకు రక్షణ కవచమని పేర్కొన్న సిసోడియా, పవర్ లూమ్ ఉత్పత్తులను హ్యాండ్లూమ్ పేరుతో విక్రయించి వినియోగదారులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చట్టం అమలులో లోపాలు ఉంటే సరిదిద్ది, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని సూచించారు.
గుర్తింపు చిహ్నాల పై అవగాహన
అసలైన చేనేత వస్త్రాలను గుర్తించేందుకు సిల్క్ మార్క్, హ్యాండ్లూమ్ మార్క్, జీఐ ట్యాగ్ వంటి గుర్తింపు చిహ్నాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ గుర్తులు లేని ఉత్పత్తుల విక్రయాలపై నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు.
కార్మికుల సంక్షేమం
రోజుకు 10-12 గంటలు కష్టపడినా చేనేత కార్మికులకు తగిన ఆదాయం అందకపోవడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. ఒక చీర నేయడానికి 4-5 రోజులు, బెడ్షీట్కు 2 రోజులు పడుతుందని, అందువల్ల పవర్ లూమ్ ఉత్పత్తులతో పోటీ పడటం కష్టమని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, నూలు పథకాలు, పెన్షన్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పాటు గిట్టుబాటు ధర కల్పించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
అంతర్జాతీయ గుర్తింపు
భారతీయ చేనేతకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, ఈ సంప్రదాయాన్ని కాపాడుకోవడం అవసరమని అన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ గుత్తు రాజారావుతో పాటు సాహు, సుబసుత్, హరిబాబు, సాహు మోహన్ అధికారులు చేనేత చట్టం, సిల్క్ మార్క్, హ్యాండ్లూమ్ మార్క్లపై వివరించారు. డెవలప్మెంట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







