సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్నారై తెలుగుదేశం మహానాడు
- May 15, 2026
దమ్మాం: సౌదీ అరేబియాలో ఎన్నారై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహానాడు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. తెలుగుదేశం గల్ఫ్ కౌన్సిల్ ఇచ్చిన పిలుపుతో సౌదీ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రవాసులు భారీ సంఖ్యలో దమ్మాంకు తరలివచ్చారు. దేశంలోని సుదూర ఎడారి ప్రాంతాల నుంచీ 1700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కూడా పార్టీ అభిమానులు కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణా నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం రాజకీయ సభకన్నా తెలుగు కుటుంబాల ఆత్మీయ కలయికగా మారింది. విజయవాడ నుంచి ప్రత్యేకంగా హాజరైన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, పార్టీ నాయకుడు మహాసేన రాజేశ్ సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
“సౌదీపై ఉన్న అపోహలు తొలగాలి”
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్, సౌదీ అరేబియా గురించి బయటి ప్రపంచంలో ఉన్న అభిప్రాయాలకు భిన్నంగా అక్కడి పరిస్థితులు ఉన్నాయని అన్నారు. విదేశాల్లో తెలుగు ప్రజలు ఐక్యంగా ఉండటం అభినందనీయమని పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమర్నాథ్ రెడ్డి, పార్టీ నాయకుడు సుఖవాసిలు వీడియో కాల్ ద్వారా సభను ఉద్దేశించి మాట్లాడి సౌదీలోని తెలుగుదేశం కార్యకర్తలను అభినందించారు.
సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి
గాయకులు రఘు కుంచె, మాలవిక తమ మధుర గానాలతో సభికులను అలరించారు. రియాధ్ నగరం నుంచి మహిళలు, చిన్నారులతో కలిసి ప్రత్యేక బస్సుల్లో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి దమ్మాంకు చేరుకోవడం విశేషంగా నిలిచింది.
పార్టీ నాయకుడు వడ్లమూడి సారథినాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తలు తెల్లవారుజామునే బయలుదేరి కార్యక్రమానికి హాజరయ్యారు. పారిశ్రామిక నగరం జుబైల్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
1700 కిలోమీటర్ల ప్రయాణం
జోర్డాన్ సరిహద్దులోని తబూక్ నుంచి 1700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చిన రోహన్ కుమార్, జెద్ధా నుంచి 1200 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన శివ రామకృష్ణలు తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటిచెప్పారు.
కార్యకర్తలకు ఆత్మీయ స్వాగతం
కార్యక్రమ నిర్వహణలో జానీ బాషా, రాజశేఖర్, ఖాలీద్ సైఫుల్లా, కోగంటి శ్రీనివాసరావు, భరద్వాజ్, చంద్రశేఖర్, భాను ప్రకాశ్, చెన్నుపాటి నరేష్, గడ్డం శిల్పా, మండవ అక్షిత తదితరులు కీలక పాత్ర పోషించారు. రెండు రోజులుగా విశ్రాంతి లేకుండా పనిచేసినప్పటికీ వచ్చిన ప్రతి కార్యకర్తను ఆత్మీయంగా పలకరిస్తూ స్వాగతించారు.
తెలుగు వంటకాల రుచి
అతిథ్య రెస్టారెంట్ వడ్డించిన సంప్రదాయ తెలుగు వంటకాలను సభికులు ఆస్వాదించారు. రంజిత్, సత్తిబాబు, ముజ్జమ్మీల్, సతీశ్ తదితరులు భోజన వడ్డనలో సేవలందించారు.
విజయవాడకు నేరుగా విమాన సర్వీసులు కావాలి
ఈ సందర్భంగా సౌదీ అరేబియా తెలుగుదేశం అధ్యక్షుడు ఖాలీద్ సైఫుల్లా కీలక ప్రతిపాదన చేశారు. సౌదీతో పాటు ఇతర గల్ఫ్ దేశాల నుంచి విజయవాడ విమానాశ్రయానికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరారు. గల్ఫ్లోని ఎయిర్లైన్స్ సంస్థలను ఇందుకు ఒప్పించడం ప్రతి ప్రవాసాంధ్రుడి బాధ్యతగా భావించాలని సూచించారు. ఈ ప్రతిపాదనను మహానాడు తీర్మానంగా ఆమోదించింది.


తాజా వార్తలు
- తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్..ఎవరికి ఏ శాఖ?
- మల్కాజిగిరి కమిషనరేట్లో పోక్సో చట్టం అమలు పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం
- హయాకోమ్.. వరదల ఆందోళనలపై చర్చ..!!
- రియాద్ మెట్రో వెస్ట్రన్ స్టేషన్ ప్రారంభం..!!
- జనన, మరణ రిజిస్ట్రేషన్..వర్కింగ్ అవర్స్ ప్రకటించిన MoPH..!!
- సోషల్ మీడియాలో బంధువు ఫోటోలు పోస్ట్.. Dh3,000 ఫైన్..!!
- యంగ్ లీడర్స్.. మస్కట్ లో జాతీయ కార్యక్రమం ప్రారంభం..!!
- ఫ్లైట్ లో ప్రయాణికుడిని రక్షించిన యూఏఈ నర్సు..!!
- మే 23 నుండి బెంగళూరు–ముంబై కొత్త రైలు ప్రారంభం!
- SRH vs RCB మ్యాచ్ టికెట్ల పేరిట కొత్త సైబర్ దందా.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!









