రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసు.. ఇద్దరు నిందితుల అరెస్ట్: సీపీ విసి సజ్జనార్
- May 23, 2026
హైదరాబాద్: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లో సంచలనం సృష్టించిన మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ రంజన్ హత్య, బంగారు ఆభరణాల దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నేపాలీ ముఠాలోని ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు.
మాజీ ఐపీఎస్ అధికారి ఇంట్లో నేపాల్కు చెందిన కల్పన అనే మహిళ గత ఎనిమిది నెలలుగా పనిమనిషిగా ఉంటోంది. అంతకుముందు పుణెలో పనిచేసిన ఆమె, అక్కడ పరిచయమైన వికాస్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. వినయ్ రంజన్ రే ఇంట్లో భారీగా నగలు, సంపద ఉందని గమనించిన కల్పన, ఆ విషయాన్ని తన ప్రియుడు వికాస్కు చేరవేసింది. వికాస్ ఆదేశాల ప్రకారం ఆమె ఇంట్లోని ప్రతి కదలికను, కుటుంబ సభ్యుల వివరాలను ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు అతనికి లీక్ చేస్తూ వచ్చింది. ఇంట్లో యజమాని లేని సమయాన్ని చూసి దొంగతనం చేయడానికి వికాస్ ఒక పెద్ద నేపాలీ గ్యాంగ్ను (సునీల్ పెర్యార్, సృజనశాయి, నేత్రశాయి, దినేశ్శాయి, గణేశ్శాయి, శంకర్ లామా, కాంచన) రంగంలోకి దించాడు. మే 7న రెక్కీ నిర్వహించిన అనంతరం, మే 8వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (రాత్రి ఒంటి గంటకు) ముగ్గురు నిందితులు ప్లాన్ ప్రకారం ఇంట్లోకి చొరబడ్డారు. మిగిలిన నలుగురు నిందితులు బయట కాపలాగా నిలబడ్డారు.
దారుణ హత్య.. 23 తులాల బంగారం దోపిడీ
ఇంట్లోకి వెళ్లిన నిందితులు బెడ్రూమ్లో ఉన్న తనూజ రంజన్ నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి ఊపిరాడకుండా చేసి దారుణంగా హతమార్చారు. అనంతరం ఆమె మెడలోని మంగళసూత్రం, ఉంగరాలతో పాటు బీరువాలోని నగలను కలిపి మొత్తం 23 తులాల బంగారాన్ని దోచుకుని పరారయ్యారు. హత్య అనంతరం నిందితులు నాంపల్లి రైల్వేస్టేషన్కు చేరుకుని తెలంగాణ ఎక్స్ప్రెస్లో కాజీపేట వెళ్లారు. అక్కడ సొమ్మును వాటాలుగా పంచుకుని, పోలీసులను తప్పుదోవ పట్టించడానికి నాలుగైదు రైళ్లు మారుస్తూ వేర్వేరు ప్రాంతాలకు పారిపోయారు. ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా ఒకరికొకరు మాట్లాడుకుంటూ యూపీ-నేపాల్ సరిహద్దు దాటాలని ప్లాన్ చేశారు. అయితే, నిందితుల్లో ఒకడైన సునీల్ పెర్యార్ తన వాటాకు వచ్చిన బంగారాన్ని ముంబై తీసుకెళ్లి దిలీప్ బిశ్వకర్మ అనే వ్యక్తికి విక్రయించాడు.
12 ప్రత్యేక బృందాలతో వేట
ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుల కదలికలను ట్రాక్ చేస్తూ ముంబైలో ఉన్న సునీల్ పెర్యార్తో పాటు నగలు కొనుగోలు చేసిన దిలీప్ బిశ్వకర్మను అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారులైన కల్పన, ఆమె ప్రియుడు వికాస్ ఇప్పటికే నేపాల్ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్టలో అతిపెద్ద వేద పాఠశాల సముదాయానికి భూమిపూజ చేసిన సీఎం రేవంత్
- భారత్ కు చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి
- యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల..
- భారతదేశానికి మరో అంతర్జాతీయ గౌరవం
- లాయర్ ఖాజా మొయినుద్దీన్ను కారుతో తొక్కించి హత్య!
- యూఏఈలో ఉద్యోగం మారుతున్నారా?బ్యాన్ పడకుండా ఉండాలంటే ఈ రూల్స్ తెలుసుకోండి!
- భారతదేశంలోనే పొడవైన నాన్స్టాప్ రూట్ కలిగిన టాప్-2 రైళ్లు ఇవే!
- విమానాల్లో యూఏఈకి వస్తున్న భారతీయ మేకలు..ధరలు 800 దిర్హాముల నుండి ప్రారంభం!
- రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసు.. ఇద్దరు నిందితుల అరెస్ట్: సీపీ విసి సజ్జనార్









