యాదగిరిగుట్టలో అతిపెద్ద వేద పాఠశాల సముదాయానికి భూమిపూజ చేసిన సీఎం రేవంత్
- May 23, 2026
రూ. 99.55 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా టెంపుల్ సిటీ పరిధిలో రూ. 99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. యాదగిరిగుట్టను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరహాలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను ప్రారంభించినట్లు తెలిపారు.
రూ. 43.80 కోట్ల అంచనా వ్యయంతో 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న వేద పాఠశాలలో సంప్రదాయ ఆశ్రమ గురుకుల పద్ధతిలో 300 మంది విద్యార్థులకు వసతితో కూడిన వేద విద్య అందించనున్నారు. ఈ సముదాయంలో హోమాలు, యాగాలు నిర్వహించేందుకు ప్రత్యేక శాలలు, గోశాల కూడా ఏర్పాటు చేయనున్నారు.
అదనంగా రూ. 43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం నిర్మాణ పనులకు కూడా శ్రీకారం చుట్టారు. కొండపై స్వామివారి నిత్య కల్యాణాల నిర్వహణ కోసం రూ. 9.87 కోట్లతో భారీ కల్యాణ మండపం నిర్మించనున్నారు. అలాగే భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి రూ. 1.41 కోట్లతో రక్షణ పైకప్పు (కానోపీ) ఏర్పాటు చేయనున్నారు. రథశాల వైపు వాయవ్య దిశలో ఉన్న మాడవీధులకు అనుసంధానంగా రూ. 1.35 కోట్ల వ్యయంతో కొత్త మెట్ల నిర్మాణ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ పోలీసింగ్లో ఏఐ వినియోగానికి కార్యాచరణ: డీజీపీ సీవీ ఆనంద్
- సీఎం చంద్రబాబును కలిసిన అపోలో ప్రీతారెడ్డి
- యాదగిరిగుట్టలో అతిపెద్ద వేద పాఠశాల సముదాయానికి భూమిపూజ చేసిన సీఎం రేవంత్
- భారత్ కు చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి
- యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల..
- భారతదేశానికి మరో అంతర్జాతీయ గౌరవం
- లాయర్ ఖాజా మొయినుద్దీన్ను కారుతో తొక్కించి హత్య!
- యూఏఈలో ఉద్యోగం మారుతున్నారా?బ్యాన్ పడకుండా ఉండాలంటే ఈ రూల్స్ తెలుసుకోండి!
- భారతదేశంలోనే పొడవైన నాన్స్టాప్ రూట్ కలిగిన టాప్-2 రైళ్లు ఇవే!









