హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- June 22, 2026
అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’ని (Strait of Hormuz) ఇరాన్ మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ చమురు మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. సోమవారం ఆసియా మార్కెట్లు ప్రారంభం కావడమే ముడిచమురు ధరల పెరుగుదలతో మొదలయ్యాయి. గ్లోబల్ బెంచ్మార్క్ అయిన ‘బ్రెంట్ క్రూడ్’ (Brent Crude) ధర సుమారు 1.24 శాతం పెరిగి బ్యారెల్కు 81.04 డాలర్లకు (గరిష్టంగా 82.30 డాలర్లు) చేరింది. అలాగే అమెరికాకు చెందిన డబ్ల్యూటీఐ క్రూడ్ (WTI Crude) ఏకంగా 2.53 శాతం పెరిగి 77.77 డాలర్ల వద్ద కొనసాగుతోంది. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలపై ఈ తాజా పరిణామం కోలుకోలేని దెబ్బతీసింది.
మూసివేతకు గల కారణం ఇదే..
లెబనాన్పై ఇజ్రాయెల్ దళాలు జరుపుతున్న దాడులను ఇరాన్ తీవ్రంగా తప్పుపట్టింది. అమెరికా మద్దతుతో జరుగుతున్న ఈ దాడులు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సైనిక విభాగం ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (IRGC) హర్మూజ్ జలసంధిని పూర్తిగా బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నిర్ణయం ప్రభావం షిప్పింగ్ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. శనివారం నాడు ఈ జలసంధి మీదుగా 26 వాణిజ్య నౌకలు ప్రయాణించగా, ఆదివారం నాటికి ఆ సంఖ్య కేవలం ఐదుకు పడిపోయిందని అంతర్జాతీయ రవాణా గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడిచమురులో ఐదో వంతు (20 శాతం) వాటాతో పాటు భారీగా ఎల్ఎన్జీ (LNG) గ్యాస్ ఎగుమతులు కూడా ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. అందువల్ల ఇక్కడ ఏమాత్రం అంతరాయం ఏర్పడినా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇంధన సంక్షోభం తలెత్తే ముప్పు ఉంది.
దౌత్య చర్చల వేళ ముదిరిన వివాదం
నిజానికి గత ఏప్రిల్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 60 రోజుల పాటు పొడిగించి, దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలు భావించాయి. ఇందులో భాగంగానే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆదివారం ఇరాన్ ఉన్నతాధికారులతో ప్రాథమిక చర్చలు జరిపారు. అయితే, మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం.. ఒకవేళ చర్చలు విఫలమైతే ఇరాన్పై కఠినమైన సైనిక చర్యలు ఉంటాయని హెచ్చరించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.
ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని నౌకలు తమ లొకేషన్ ట్రాకర్లను (ట్రాన్స్పాండర్లు) ఆఫ్ చేసి ప్రయాణించే అవకాశం ఉన్నందున వాస్తవ రవాణా గణాంకాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, రాబోయే రోజుల్లో చమురు ధరలు మరింత పెరిగే సూచనలు ఉన్నాయని, తాజా అప్డేట్ల కోసం అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లను నిశితంగా గమనించాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- అండమాన్ సెల్యులార్ జైలులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్..
- యూజర్లకు UPI ఛార్జీలు ఉండవు.. కేంద్రం మరోసారి క్లారిటీ
- డేటింగ్ యాప్లో పురుషులకు అందంతో వల...రూ.6 కోట్లు వసూళ్లు
- మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం..మూడు దేశాల జెండా రంగుల్లో మెరిసిన సౌదీ ల్యాండ్మార్క్స్
- BRICS వాణిజ్య మంత్రుల సమావేశంలో యూఏఈ..
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ ట్యాంకర్పై ఇరాన్ దాడిని జీసీసీ తీవ్రంగా ఖండించింది
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ చమురు ట్యాంకర్పై క్షిపణి దాడి..బహ్రెయిన్ తీవ్ర ఖండన
- హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై క్షిపణి దాడి..సిబ్బంది సురక్షితం
- దుబాయ్లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్కు 2.7మిలియన్ కాల్స్..!!







