సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి

- June 25, 2026 , by Maagulf
సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన 52వ ప్రగతి (PRAGATI) సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావుతో పాటు రాష్ట్ర,డీజీపీ సి.వి.ఆనంద్, కేంద్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు హాజరయ్యారు.

సమావేశంలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మోసాల అంశాలపై ప్రధానమంత్రి ప్రత్యేకంగా చర్చించారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు శాఖలు, బ్యాంకులు, డిజిటల్ వేదికలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ప్రధాని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సైబర్ నేరాల నియంత్రణకు సంబంధించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సైబర్ నేరాల నివారణ, ఫిర్యాదుల స్వీకరణ, దర్యాప్తు వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. బాధితులకు వేగంగా సహాయం అందించడంతో పాటు ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

అలాగే సైబర్ నేరాల ఫిర్యాదుల నమోదును సులభతరం చేయడానికి ఈ-జీరో ఎఫ్‌ఐఆర్ (e-Zero FIR), జీరో ఎఫ్‌ఐఆర్ (Zero FIR) విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిరంతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఆదేశించారు.

తెలంగాణ పోలీసులు ఇప్పటికే సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోని అనేక రాష్ట్రాల కంటే ముందంజలో ఉన్నారని అధికారులు తెలిపారు. సైబర్ మోసాలపై పోరాటంలో రాష్ట్ర పోలీసు శాఖ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

ప్రజలకు హెచ్చరికగా, "డిజిటల్ అరెస్ట్" పేరుతో ఎవరైనా ఫోన్ చేసి బెదిరించినా భయపడవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు చెల్లించవద్దని సూచించారు. అలాంటి కాల్స్ సైబర్ మోసగాళ్ల కుట్రగా గుర్తించి వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com