మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- June 29, 2026
షార్జా: వ్యాపార సంస్థలకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకున్న షార్జా ప్రభుత్వం, మూడు నెలల పాటు జరిమానాలు, పలు ఫీజుల్లో 50 శాతం తగ్గింపును ప్రకటించింది. షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం మేరకు ఈ రాయితీలను అమలు చేస్తున్నట్లు షార్జా పోలీసులు సోమవారం వెల్లడించారు.
ఈ ప్రత్యేక ప్యాకేజీ కింద వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన భద్రతా అనుమతుల (సెక్యూరిటీ పర్మిట్) పునరుద్ధరణ ఫీజులు, ఉల్లంఘనలపై విధించే జరిమానాలు, సెక్యూరిటీ సిస్టమ్ సబ్స్క్రిప్షన్ ఫీజులపై 50 శాతం తగ్గింపు అందించనున్నారు. అలాగే, తప్పనిసరి శిక్షణా కార్యక్రమాల ఫీజుల్లో 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ రాయితీలు నిర్ణయం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి మూడు నెలల పాటు కొనసాగనున్నాయి. వ్యాపార సంస్థల నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం, వ్యాపారాల స్థిరత్వాన్ని పెంపొందించడం, షార్జాను ప్రముఖ పెట్టుబడి గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని షార్జా పోలీసులు పేర్కొన్నారు.
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న వ్యాపారాలకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని, ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎస్ఎంఈలు) ఎక్కువగా లబ్ధి పొందనున్నాయని అధికారులు తెలిపారు. షార్జాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యాపారాల్లో ఎస్ఎంఈలే అత్యధికంగా ఉండి, ఉపాధి కల్పనతో పాటు ఆర్థిక వైవిధ్యానికి కీలకంగా నిలుస్తున్నాయి.
ఈ రాయితీలపై మరిన్ని వివరాల కోసం వ్యాపార సంస్థలు షార్జా పోలీసుల కాల్ సెంటర్ 901ను సంప్రదించాలని సూచించారు.
వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడం, నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం, ప్రైవేట్ రంగ అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా యూఏఈలోని వివిధ ఎమిరేట్లు వరుసగా ప్రోత్సాహక చర్యలు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రారంభంలో దుబాయ్ కూడా పర్యాటకం, వాణిజ్యం, విద్య, రవాణా, రియల్ ఎస్టేట్ తదితర రంగాలకు సంబంధించిన 33 కార్యక్రమాలతో కూడిన 2.5 బిలియన్ దిర్హామ్ల ప్రోత్సాహక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపారా?
- భారత్–యూఏఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని IBPC పిలుపు
- ఒమన్ తీరంలో ఆయిల్ కాలుష్యం.. 12 కిలోమీటర్ల మేర ప్రభావం..!!
- బహ్రెయిన్లో రెస్టారెంట్ మెనూల్లో క్యాలరీల వివరాలకు కొత్త విధానం..!
- ప్రపంచ శాంతి సందేశంతో 135 దేశాల పర్యటన.. 600 రోజుల్లో 2.5 లక్షల కిలోమీటర్లు..!!
- దుబాయ్లో బైక్ రైడర్కు రూ.4,000 దిర్హమ్స్ జరిమానా..!!
- ఇండోనేషియాలో భారీ భూకంపం.. 47కి చేరిన మరణాలు
- గుడ్న్యూస్.. ఖతార్ నుంచి భారత్కు మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ ప్రారంభం..!!
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్







