జాబ్ కోసం ప్రభుత్వ ఉద్యోగికి లంచం.. ముగ్గురికి రెండేళ్ల జైలుశిక్ష..!!

- July 30, 2026 , by Maagulf
జాబ్ కోసం ప్రభుత్వ ఉద్యోగికి లంచం.. ముగ్గురికి రెండేళ్ల జైలుశిక్ష..!!

మనామా: ప్రభుత్వ ఉద్యోగికి లంచం ఇచ్చి తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నించిన ముగ్గురికి బహ్రెయిన్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి బీడీ 1,400 జరిమానా విధించింది. శిక్ష పూర్తయిన అనంతరం తొలి నిందితుడిని బహ్రెయిన్ నుంచి బహిష్కరించాలని కూడా కోర్టు ఆదేశించింది.

కేసు వివరాల ప్రకారం.. తన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు సహకరించాలని కోరుతూ నిందితులు ఒక ప్రభుత్వ ఉద్యోగికి డబ్బు ఆఫర్ చేశారు. అయితే ఆ ఉద్యోగి వెంటనే ఈ విషయాన్ని అవినీతి నిరోధక విభాగం (Anti-Corruption Directorate) దృష్టికి తీసుకెళ్లాడు.

ఈ ఘటనపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. నిందితులు వ్యక్తిగతంగా కలుసుకుని బీడీ 1,400 లంచంగా ఇవ్వాలని ప్రయత్నించిన దృశ్యాలను రహస్యంగా రికార్డు చేసింది.  దీంతో నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో కోర్టు వారికి రెండేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి బీడీ 1,400 జరిమానా విధించింది. మొదటి నిందితుడిని శిక్ష అనంతరం దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.

ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ అవినీతిని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. లంచం వంటి చర్యలు ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని, ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com