సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- July 31, 2026
హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖలో డిజిటల్ పోలీసింగ్ను మరింత వేగవంతం చేసి, సాంకేతికత ఆధారిత సేవలను విస్తరించాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. టెక్నికల్ సర్వీసెస్, పోలీస్ కంప్యూటర్స్ వింగ్ పనితీరును సమీక్షించిన సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, 2003లో e-COPS ద్వారా తెలంగాణలో ఈ-పోలీసింగ్కు పునాది పడిందని, అప్పటి నుంచి డిజిటల్ వ్యవస్థలను నిరంతరం అభివృద్ధి చేస్తూ వస్తున్నామని తెలిపారు. భవిష్యత్ పోలీసింగ్ పూర్తిగా సాంకేతికత ఆధారంగానే సాగుతుందని, ఆ దిశగా తెలంగాణ పోలీసులు వేగంగా ముందుకు సాగాలని అన్నారు.
అయితే, కొన్ని ప్రాజెక్టుల అమలు తాను ఆశించినంత వేగంగా జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన డీజీపీ, అధికారులకు అమలు వేగాన్ని పెంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
CCTNS, TG-COP, ICJS, e-FIR వంటి కీలక డిజిటల్ ప్లాట్ఫారమ్లను మరింత బలోపేతం చేయడంతో పాటు, అత్యాధునిక ఫీచర్లతో CCTNS 3.0, TG-COP 3.0ను అభివృద్ధి చేయాలని సూచించారు. అన్ని డిజిటల్ సేవలను ఒకే సమగ్ర డిజిటల్ ఎకోసిస్టమ్లో అనుసంధానం చేయాలని, పోలీసు రికార్డుల పూర్తి డిజిటలైజేషన్ తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించారు.
కృత్రిమ మేధస్సు (AI) భవిష్యత్లో నేర విశ్లేషణ, నేరాల అంచనా (Predictive Policing), దర్యాప్తు, నిర్ణయాల ప్రక్రియలో కీలక పాత్ర పోషించనుందని డీజీపీ పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా అన్ని విభాగాలు సాంకేతికత ఆధారిత విధానాలను అవలంబించి, నిర్దిష్ట గడువుల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు.
అధికారుల మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు, ప్రతి పోలీసు అధికారి సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి, తెలంగాణ పోలీసులను దేశంలోనే భవిష్యత్ పోలీసింగ్కు ఆదర్శంగా నిలపాలని డీజీపీ సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు.
అదేవిధంగా, త్వరలో ప్రారంభం కానున్న TSPARK సంస్థ ప్రారంభానికి అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. ఈ కొత్త కార్యక్రమం తెలంగాణ పోలీసు శాఖలో సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించడంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







