కాలేజీ విద్యార్థులకు హెచ్‌ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!

- August 01, 2026 , by Maagulf
కాలేజీ విద్యార్థులకు హెచ్‌ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!

బెంగళూరు: ఇటీవల సోషల్ మీడియాలో కర్ణాటకలో 7 వేల మంది కాలేజీ విద్యార్థులకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందంటూ ఒక వార్త విస్తృతంగా వైరల్ అయింది.ఈ వార్తతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ ప్రచారాన్ని కర్ణాటక రాష్ట్ర ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ (KSAPS) పూర్తిగా ఖండించింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారం వాస్తవాలకు విరుద్ధమని స్పష్టం చేసింది.

ఆరోగ్య శాఖ అలాంటి ఆదేశాలు జారీ:
సొసైటీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, వైరల్ అవుతున్న 7 వేల మంది విద్యార్థుల గణాంకం పూర్తిగా తప్పుదోవ పట్టించేదని తెలిపారు. అలాగే కాలేజీ విద్యార్థులకు హెచ్‌ఐవీ పరీక్షలు తప్పనిసరి చేశారనే ప్రచారంలో కూడా ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం లేదా సంబంధిత ఆరోగ్య శాఖ అలాంటి ఆదేశాలు జారీ చేయలేదని వెల్లడించారు.

అధికారులు వివరించిన ప్రకారం, 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల హెచ్‌ఐవీ బాధితుల్లో సుమారు 39 వేల మందికి 2004 సంవత్సరం నుంచి యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ గణాంకాలు రాష్ట్రంలోని మొత్తం హెచ్‌ఐవీ బాధితులకు సంబంధించినవేనని, వాటిని కేవలం కాలేజీ విద్యార్థులతో ముడిపెట్టి ప్రచారం చేయడం పూర్తిగా తప్పుదారి పట్టించే చర్య అని పేర్కొన్నారు.

అంతేకాకుండా, సోషల్ మీడియాలో నిర్ధారణ లేని వార్తలను నమ్మవద్దని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని అధికారిక ప్రభుత్వ వర్గాలు లేదా ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనల ద్వారానే తెలుసుకోవాలని సూచించారు. తప్పుడు ప్రచారం సమాజంలో అనవసర భయాందోళనలు సృష్టించడంతో పాటు హెచ్‌ఐవీతో జీవిస్తున్న వ్యక్తులపై వివక్షకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. కాబట్టి ఇలాంటి సున్నితమైన అంశాలపై వాస్తవాలను మాత్రమే విశ్వసిస్తూ, నిర్ధారిత సమాచారం ఆధారంగానే స్పందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com