సరిహద్దుల్లో కెమెరాలు, డ్రోన్లతో పటిష్ఠ నిఘా : సిరియా ఆర్మీ

- October 20, 2016 , by Maagulf
సరిహద్దుల్లో కెమెరాలు, డ్రోన్లతో పటిష్ఠ నిఘా : సిరియా ఆర్మీ

 సిరియాలోని అలెప్పో నగరం మరోసారి ఫిరంగీల మోతతో దద్దరిల్లింది. గురువారం బుస్తాన్‌- ఉల్‌-ఖస్ర్‌ ప్రాంతంలోని సహాయక బృందాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని ఐఎస్‌ ఉగ్రవాదులు ఫిరంగీ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో అనేక మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారని సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ పేర్కొంది. ఐఎస్‌ ఆకృత్యాలతో బెంబేలెత్తిన ప్రజలు ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా తరలివెళ్తున్నారని తెలిపింది. అలెప్పోలో సహాయక బృందాలు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అడ్డుకోవాలన్నదే ఐఎస్‌ దురుద్దేశమని ఆ సంస్థ పేర్కొంది.
ఉగ్రదాడుల్లో ఆప్తులు కోల్పోయిన, ఆస్తులు నష్టపోయిన పౌరులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిరియా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. బాధిత కుటుంబాలను సురక్షితంగా తరలించేందుకు రెండు రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చినట్టు సిరియా సైన్యం వెల్లడించింది. 
అలెప్పో నుంచి నిష్క్రమించేందుకు ఎనిమిది మార్గాలు 
అలెప్పో నగరం నుంచి బయటకు వెళ్లేందుకు ఎనిమిది మార్గాలను ఏర్పాటు చేసినట్టు సిరియన్‌ ఆర్మీ పేర్కొంది. తూర్పు అలెప్పో నుంచి స్వచ్ఛంధంగా బయటకు వెళ్లాలనుకునే సాయుధ తిరుగుబాటుదారుల కోసం రెండు మార్గాలు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. మరో ఆరు మార్గాల ద్వారా సిరియన్లను బయటకు పంపనున్నట్టు పేర్కొంది. ఉగ్రవాదులు సాధారణ పౌరులతో కలిసిపోయి దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపింది. ఈమేరకు సరిహద్దు దాటి వెళ్లే పౌరుల కదలికలపై పటిష్ఠ నిఘా ఏర్పరిచినట్టు తెలిపింది. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన నిఘా డ్రోన్లు, కెమెరాలను ఆయా మార్గాల్లో అమర్చినట్టు పేర్కొంది.
ఐఎస్‌కు అమెరికా క్షిపణులు ఐఎస్‌కు అమెరికా సహకరిస్తోందని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గే షోయిగూ తెలిపారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన అమెరికా క్షిపణులు ఉగ్రవాద సంస్థల స్థావరాలకు చేరుతున్నాయని అన్నారు. రష్యా, సిరియాలు యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయని అమెరికా, ఈయూ దేశాధినేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. సిరియాలో పెట్రేగిపోయిన ఉగ్రవాదాన్ని పారద్రోలేందుకు కృషి చేస్తున్నామని పునరుద్ఘాటించారు. కాగా, సిరియాలో కాల్పుల విరమణను సోమవారం వరకు పొడిగించాలని సిరియా సైన్యాన్ని కోరుతున్నట్టు ఐరాస సహాయక బృందాల ప్రతినిధి జాన్‌ఎగ్‌లాండ్‌ తెలిపారు.ఆపన్న హస్తం కోసం ప్రజల ఎదురుచూపులు సిరియాలో 2011లో అంతర్యుద్ధం ప్రారంభ మైంది. ఆ దేశాధ్యక్షుడు అస్సద్‌ను గద్దె దించాలని అక్కడి ప్రత్యర్థి వర్గాలతో పాటు ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయి. ఈ తరుణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సిరియాకు బాసటగా నిలిచారు. రష్యా, సిరియా భద్రతా బలగాలు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించి వందలాది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు, వైమానిక దాడుల ఫలితంగా నాలుగు లక్షల మంది మృతి చెందినట్టు అక్కడి మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థలు పేర్కొన్నాయి. ఐఎస్‌ ఆకృత్యాలను భరించలేక వేలాది మంది సిరియన్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఆహారం, ఔషదాలు, వసతి సౌకర్యాల కొరత ఏర్పడటంతో సహాయక సంస్థల ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో, సిరియాలో శాంతి స్థాపన అనివార్యమని రష్యా భావించింది. గతనెల నూతన కాల్పుల విరమణ ఒప్పందాన్ని తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలో రష్యా, అమెరికాల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అయితే, సహాయక బృందాల కాన్వారుపై రష్యా బలగాలు వైమానిక దాడికి పాల్పడ్డాయని అమెరికా ఆరోపించింది. దీనిపై పుతిన్‌ ఘాటుగా స్పందించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలు చూపాలని డిమాండ్‌ చేశారు. రష్యాపై బురదజల్లేందుకు ప్రయత్నించిన అమెరికా వెనక్కి తగ్గింది. ఆధారాలు చూపడంలో విఫలమైంది. తద్వారా అమెరికా,రష్యాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. సిరియాలో కాల్పుల విరమణ అంశం ప్రశ్నార్థకంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com