హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు

- May 02, 2017 , by Maagulf
హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు

తె లంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. వచ్చేనెల రెండో తేదీ నుంచి పదో తేదీ వరకు వీటిని జరపనున్నారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్‌లో ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఉత్సవాలను ఘనంగా జరుపుతామని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల నేపథ్యంలో ఈ మహాసభలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర సాహిత్య అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు, దీనికి ఛైర్మన్‌గా ప్రముఖ కవి నందిని సిధారెడ్డిని నియమిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ అకాడమీ ఆధ్వర్యంలోనే ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయని తెలిపారు. వీటి నిర్వహణపై మంగళవారం ఆయన సమీక్ష జరిపారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, సాహితీవేత్తలు నందిని సిధారెడ్డి, సీపీఆర్వో వనం జ్వాలా నర్సింహారావు, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. యావత్‌ ప్రపంచం గుర్తించే విధంగా, చరిత్రలో చిరస్థాయిలో నిలిచేలా ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో సాహిత్య అకాడమీతో పాటు సంగీత, నాటక, లలిత కళలు, జానపద అకాడమీలనూ ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు.
నందిని సిధారెడ్డి 
సి ద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో సిధారెడ్డి 1955లో జన్మించారు. బందారం, వెల్కటూరు, సిద్దిపేటలో విద్యాభ్యాసం చేశారు. ఉస్మానియాలో ఎంఏ పూర్తి చేశారు. అధ్యాపకునిగా పదవీ విరమణ పొందారు. తమ కవితలు, పాటల ద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలుగు సాహిత్యంలో డాక్టరేటు పొందిన ఆయన సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ పదవికి అన్ని విధాలా అర్హులని సీఎం భావించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com