టెహ్రాన్ : ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని మెహ్రాబాద్ విమానాశ్రయంలో మంగళవారం పెనుప్రమాదం తప్పింది. ల్యాండవుతున్న ఓ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని సురక్షితంగా కిందకు దించేశారని అధికారులు తెలిపారు. ఇరాన్ ఎయిర్ సంస్థకు చెందిన ఫాకర్ 100 విమానంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సాంకేతిక కారణాల వల్ల ల్యాండింగ్ గేర్ సరైన సమయంలో తెరచుకోలేదని.. అందువల్లే ప్రమాదం సంభవించినట్లు అధికారుల భావిస్తున్నారు.
ప్రమాదం విషయం తెలిసి వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. విమానాశ్రయంలోని అంబులెన్సులు గాయాలైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు.. ప్రమాదానికి గల కారణాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.