నష్టం 34వేల కోట్ల ..

- February 22, 2016 , by Maagulf
నష్టం 34వేల కోట్ల ..

గత నాలుగు రోజులుగా హర్యానాలో జరుగుతున్న జాట్‌ల ఉద్యమం వల్ల మొత్తం ఉత్తర భారతానికి 34వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉందని, అలాగే దీని వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయని పిహెచ్‌డి చాంబర్ అంచనా వేసింది. ఈ నాలుగు రోజుల్లో ఒక్క హర్యానాలోనే కాకుండా ఉత్తరభారతంలోని అనేక ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయని చాంబర్ అధ్యక్షుడు మహేష్ గుప్తా తెలిపారు. నిత్యావసర వస్తువుల సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల అనేక చోట్ల వీటి కొరత ఏర్పడిందని, ద్రవ్వోల్బణంపై కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగానే ఉండవచ్చన్నారు. రైల్వేలు, రహదారులు దిగ్బంధం కావడంతో అన్ని రకాలుగానూ వస్తు ఉత్పత్తి సరఫరా ఆగిపోయిందని, టూరిస్టుల రాకపోకలకు కూడా తీవ్ర విఘాతం కలిగిందని వెల్లడించారు.ఉత్పాదక రంగం, విద్యుత్ సరఫరా, నిర్మాణ రంగం కూడా తీవ్రంగా దెబ్బతిందని వీటన్నింటి కారణంగా మొత్తం ఉత్తరభారత రాష్ట్రాలు 34వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లకు జాట్‌ల ఉద్యమం కలిగిన నష్టాన్ని వాణిజ్య మండలి అంచనావేసింది. భారత స్థూల జాతీయ ఉత్పత్తిలో ఈ రాష్ట్రాల వాటా 32 శాతం ఉంటుందని తెలిపారు.చిత్రం... రోహతక్‌లో జాట్ ఉద్యమ విధ్వంసకాండలో తగులబడిన ప్రభుత్వ బస్సు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com