రేపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ

- October 19, 2021 , by Maagulf
రేపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ

అమరావతి: ఏపీలో రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య అగ్గి రాజుతోంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు భగ్గుమన్నాయి. దీంతో రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది రాష్ట్ర తెలుగుదేశం పార్టీ. టీడీపీ, వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యాలపై ఆవేశాలకు గురికావొద్దని, అందరు కూడా సంయమనం పాటించాలని ఏపీ డీజీపీ కార్యాలయం హెచ్చరించింది. రెచ్చగొట్టె వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది.

విజయవాడలోని పట్టాభి ఇంట్లోకి ప్రవేశించిన కార్యకర్తలు సామగ్రి ధ్వంసం చేశారు. ఈ రోజు ఉదయం పట్టాభి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ నర్సీపట్నం పోలీసుల నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై పట్టాభి ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశం అనంతరం సీఎం పై వ్యాఖ్యలకు నిరసనగా.. వైఎస్ఆర్ సీపీకి చెందిన కొందరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశారు. ఈ దాడిలో ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ధ్వంసం అయింది.

రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య ఘర్షణ నేపథ్యంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా దాడి చేశారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లోని టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లను కూడా ముట్టడించారు. కాగా.. కేంద్ర కార్యాలయంపై దాడి అనంతరం.. అక్కడికి చేరుకొని టీడీపీ అధినేత చంద్రబాబు పరిశీలించారు. ఘటనకు సంబంధించి పార్టీ శ్రేణులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట టీడీపీ నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, అశోక్‌బాబు, పట్టాభి తదితరులు పార్టీ కార్యాలయానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. దాడికి నిరసనగా బుధవారం రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com