విద్యాభివృద్ధి, ఆరోగ్య సంక్షేమం కోసం ఎంఎన్‌ఆర్ ట్రస్ట్ కృషి: రాష్ట్రపతి ముర్ము

- December 21, 2023 , by Maagulf
విద్యాభివృద్ధి, ఆరోగ్య సంక్షేమం కోసం ఎంఎన్‌ఆర్ ట్రస్ట్ కృషి: రాష్ట్రపతి ముర్ము

హైదరాబాద్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గోల్డెన్ జూబ్లీ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. మంచి విద్య ప్రగతికి ద్వారాలు తెరుస్తుందని, మంచి ఆరోగ్యం మనిషి జీవితాన్ని చురుగ్గా నిలుపుతుందన్నారు. ఒక సంస్థ 50 సంవత్సరాలుగా చురుగ్గా,  నిరంతరంగా అభివృద్ధి చెందుతూ ఉండటం మంచి ఆలోచనతో కూడిన ప్రయత్నాలకు నిదర్శనం అని అన్నారు. ప్రపంచ నాలెడ్జ్ ఎకానమీలో భారతదేశం నేడు ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉందని రాష్ట్రపతి అన్నారు. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న ఐటి కంపెనీలు, ఈ రాష్ట్రానికి చెందిన ప్రతిభావంతులైన ఐటి నిపుణులు భారతదేశ ఖ్యాతిని పెంపొందించడంలో సహకారం అందించారని అభినందించారు. మన ఐటీ నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారని, హైదరాబాద్‌లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఇంజినీరింగ్‌తో పాటు అన్ని వృత్తుల్లోనూ తమదైన ముద్ర వేశారన్నారు. ఈ విజయంలో విద్యాసంస్థలకు విశేషమైన కృషి ఉందన్నారు. విద్య మరియు ఆరోగ్య రంగంలో క్రియాశీలంగా ఉన్న సంస్థలు మొత్తం దేశ నిర్మాణంలో సహకార స్ఫూర్తితో ముందుకు సాగాలని రాష్ట్రపతి సూచించారు. ఇందుకోసం గ్రామీణ ప్రాంత ప్రజలకు గ్రామీణ విద్య, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్య, వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం తెలంగాణతోపాటు యావత్ దేశ సర్వతోముఖాభివృద్ధికి అవసరమని రాష్ట్రపతి అన్నారు. అణగారిన వర్గాల ప్రజల విద్యాభివృద్ధి, ఆరోగ్య సంక్షేమం కోసం ఎంఎన్‌ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిరంతరం కృషి చేయాలని ఆమె కోరారు. వారి విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి మహిళా సాధికారతకు మరింత తోడ్పడాలని ఆమె అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com