అబుధాబి BAPS హిందూ దేవాలయం పై తొలి గీతం

- February 17, 2024 , by Maagulf
అబుధాబి BAPS హిందూ దేవాలయం పై తొలి గీతం

అబుధాబి: ఫిబ్రవరి 14 న యు.ఎ.ఈ లోని అబుధాబి నగరంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవం జరుపుకున్న స్వామినారాయణ మందిరం గురించి తెలిసిందే. 

27 ఎకరాల స్థలంలో నిర్మితమైన ఈ సువిశాల మందిరం శాంతికి, సౌభ్రాతృత్వానికి, సంస్కృతుల సమాగమానికి కేంద్రంగా నిలుస్తోంది. 

ఇది గల్ఫ్ దేశాల్లోనే మొట్టమొదటిసారిగా రాతితో నిర్మించిన హిందూ దేవాలయమే కాకుండా అబుధాబిలో తొలి హిందూ దేవాలయం. 

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మాగల్ఫ్ ఒక గీతాన్ని ఆవిష్కరించింది. ఈ గీతాన్ని ప్రముఖ తెలుగు సినీగీత రచయిత సిరాశ్రీ ఆంగ్లంలో వ్రాయగా బాలీవుడ్ సంగీత దర్శకులు రవిశంకర్ స్వరపరిచారు. గాయని శ్రుతిసంకల్ప ఈ గీతాన్ని ఆలపించారు. 

ఈ గీతం గురించి చెబుతూ, "పలు దేవతామూర్తులు కొలువై ఉన్నపెద్ద దేవాలయం ఇది. పైగా ఇది ఒక కళాత్మకమైన శిలానిర్మాణం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులని జాతి, కుల, మత బేధాలు లేకుండా ఆహ్వానిస్తున్న శాంతిసౌధం. కనుక ఆంగ్లంలో వ్రాస్తేనే ఔచిత్యంగా ఉంటుందని అనిపించింది. వ్రాసిన తరువాత రవిశంకర్ చక్కగా స్వరపచగా శృతిసంకల్ప వినసొంపుగా పాడడం జరిగింది. ఆ గీతం అబుధాబి స్వామినారాయణ్ మందిరానికి అంకితం", అని గీతరచయిత సిరాశ్రీ తెలిపారు. 

సంగీత దర్శకులు రవిశంకర్ మాట్లాడుతూ, "అబుధాబిలో హిందూమందిర నిర్మాణం గురించి ఎప్పటినుంచో వింటున్నాను. స్వామినారాయణ్ దేవాలయాలంటేనే సనాతన సంస్కృతికి కేంద్రాలు. ఈ అబుధాబి దేవాలయానికి పాటని స్వరపరిచే అవకాశం నాకు రావడం నిజంగా ఆ స్వామీనారాయణుడి దీవెనే", అని అన్నారు. 

"ఇది నేను పాడిన తొలి అంతర్జాతీయ గీతం. సరైన పాటతో నా ఆంగ్ల గానం మొదలైనందుకు చాలా సంతోషంగా ఉంది. దైవాన్ని, శాంతిని, కళని, సహనాన్ని కీర్తిస్తూ పాడడం కంటే గొప్ప అనుభూతి ఏముంటుంది", అని అన్నారు గాయని శ్రుతిసంకల్ప.

మాగల్ఫ్ చీఫ్ ఎడిటర్ శ్రీకాంత్ చిత్తర్వు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సులువుగా పాడుకునే విధంగా సరళమైన పదార్థాల్లో రచించిన ఈ పాటను మాగల్ఫ్ సమర్పించటం ఎంతో ఆనందంగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com