బస్సు యాత్రలో సీఎం జగన్ పై రాయిదాడి..ఈసీ కీలక ఆదేశాలు
- April 14, 2024
విజయవాడ: విజయవాడలో మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్ర చేస్తున్నవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి జరిగింది. సింగ్ నగర్ గంగానమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తి పూలతోపాటు రాయిని కూడా విసరడంతో జగన్ కనుబొమ్మ పైభాగంలో రాయి తాకింది. దీంతో గాయం కావడంతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు జగన్ మోహన్ రెడ్డికి చికిత్స అందించారు. గాయమైన చోట కుట్లు వేశారు. మరోవైపు ఈ ఘటనలో.. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా గాయమైంది. దీంతో అతనికికూడా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించారు.
సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. దాడి జరిగిన గంగానమ్మ గుడి ప్రదేశం వద్ద జల్లెడ పట్టిన పోలీసులు.. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పక్కనే ఉన్న ఇండోర్ స్టేడియం నుంచి దాడి జరిగిందా అనే దానిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. పాఠశాలలోని ఓ ఫ్లోర్ నుంచి నిందితుడు దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి సమయంలో గ్రూప్ కాల్స్ పై ఆరా తీస్తున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. దాడి జరిగిన ప్రదేశాన్ని విజయవాడ సీపీ పరిశీలించారు. మరోవైపు.. జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్రలో జరిగిన దాడి ఘటనపై జాతీయ ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఘటనపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. దాడి ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఐఎస్ డబ్ల్యూ, విజయవాడ సీపీని కోరింది.
విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై రాయి దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. జగన్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ పై దాడి ఘటన పట్ల స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు నాయుడు.. ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికమైన విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. అంతేకాదు.. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. వీరితోపాటు వైఎస్ షర్మిల, తమిళనాడు సీఎం స్టాలిన్, బీఆర్ఎస్ నేత కేటీఆర్, పలువురు ప్రముఖ నేతలు జగన్ పై రాయిదాడిని ఖండించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







