డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ
- December 07, 2025
విజయవాడ: మెనోపాజ్ దశలో మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, ఆధునిక చికిత్సా విధానాలు, వైద్య పరిశోధనల పురోగతి తదితర అంశాలపై వైద్యులకు అవగాహన కల్పించేందుకు విజయవాడ మెనోపాజ్ సొసైటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. నగరంలోని జీఆర్టీ గ్రాండ్ హోటల్లో ఆదివారం నిర్వహించిన ఈ సదస్సులో ‘ప్రొలాప్స్ రీడిఫైన్డ్’ అనే అంశంపై ప్రసంగించిన డాక్టర్ అనురాధ కోడూరి.. తన తాజా నవల ‘మై బాలీవుడ్ రొమాన్స్’ను ఆవిష్కరించారు.పారు అనే మహిళ ప్రధాన పాత్రగా రూపుదిద్దుకున్న ఈ నవలలో స్త్రీ జీవితానికి సంబంధించిన అనేక సున్నితమైన అంశాలను రచయిత్రి హృద్యంగా ఆవిష్కరించారు. సమర్ నన్నెందుకు ప్రేమించట్లేదు? అనే ప్రశ్నతో సతమతమయ్యే సంప్రదాయ హిందూ మహిళ పారు మానసిక సంఘర్షణ ఈ నవల. తను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నప్పటికీ, కుటుంబ గౌరవం కోసం 23 ఏళ్ల వయసులో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటుంది. షికాగోలో విజయవంతమైన గైనకాలజిస్టుగా రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న పారు.. ఇద్దరు బిడ్డలకు తల్లిగానూ తన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తుంటుంది. 20 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఆమె భర్త సమర్.. వేరే మహిళతో ప్రేమలో పడి పారును వదిలేస్తాడు. భర్త చేసిన మోసంతో కుంగిపోయిన పారు జీవితంలోకి తన మాజీ ప్రియుడు హర్ష తిరిగొస్తాడు. భర్త చేసిన మోసం, సామాజిక సంఘర్షణలు, బిడ్డల సంరక్షణ, తన సుఖం తాను చూసుకోవడం.. ఇలా అనేక అంశాల మధ్య చిక్కుకున్న పారు.. చివరకు ఏ నిర్ణయం తీసుకుందనే విషయం తెలియాలంటే మై బాలీవుడ్ రొమాన్స్ నవలను చదవాల్సిందే. ప్రతిభావంతురాలైన వైద్యురాలిగా ఖ్యాతి గడించిన డాక్టర్ అనురాధ కోడూరి.. నవలా రచయిత్రిగానూ ప్రత్యేకతన చాటుకుంటున్నారు. విజయవాడ మెనోపాజ్ సొసైటీ తొలి వార్షిక సదస్సులో డాక్టర్ అనురాధ కోడూరిని పలువురు అభినందించారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో, సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ హరిత పిన్నమనేని మాట్లాడుతూ.. మెనోపాజ్ పై స్త్రీలకు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. ఆధునిక వైద్య చికిత్సలు, మానసిక సంసిద్ధతతో మెనోపాజ్ సంబంధిత సమస్యలను అధిగమించొచ్చని ఆమె పేర్కొన్నారు. మెనోపాజ్ సంబంధిత చికిత్సల్లో నూతన పద్ధతులు, హార్మోన్ థెరపీ మార్గదర్శకాలు, రిస్క్ ఫ్యాక్టర్లు, వ్యక్తిగత చికిత్సా విధానంపై తాజా అధ్యయనాలను వైద్యులకు పరిచయం చేయడం ఈ సదస్సు ముఖ్య లక్ష్యమని తెలిపారు. మెనోపాజ్ పై ఇంకా శాస్త్రీయ అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. సొసైటీ సెక్రటరీ డాక్టర్ మైనేని పూజిత మాట్లాడుతూ.. మెనోపాజ్ సమయంలో వచ్చే సైకాలజికల్ లక్షణాలు, డిప్రెషన్, ఆంగస్టీ, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలను గుర్తించే విధానం, ఆధునిక మేనేజ్మెంట్పై వైద్యులు మరింత దృష్టి పెట్టాలని సూచించారు. ఈ అంశంపై స్పెషలైజ్డ్ కౌన్సెలింగ్ ప్రోటోకాల్స్ కూడా వివరించారు. విజయవాడ మెనోపాజ్ సొసైటీ ట్రెజరర్ డాక్టర్ భీమవరపు నవీన మాట్లాడుతూ.. మెనోపాజ్ తర్వాత మహిళల్లో పెరుగుతున్న ఆస్టియోపొరోసిస్, హృదయ సంబంధిత వ్యాధులు, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలను ముందుగానే గుర్తించి, నిరోధక చర్యలు తీసుకోవడం కోసం తాజా గైడ్లైన్స్ను ఈ కాన్ఫరెన్స్లో చర్చిస్తున్నట్టు చెప్పారు. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, క్లినికల్ మానిటరింగ్లో వైద్యులకు ఆధునిక సమాచారం అందించడం ముఖ్యమని తెలిపారు. సదస్సులో భాగంగా నిర్వహించిన పలు శాస్త్రీయ సెషన్లలో వివిధ అంశాలపై పలువురు వైద్య నిపుణులు ప్రసంగించారు. ‘మెనోపాజ్ కేర్ - బ్రిడ్జింగ్ ఎవిడెన్స్ అండ్ కేర్’ అనే థీమ్ తో నిర్వహించిన ఈ వైద్య సదస్సులో మెనోపాజ్ దశలో స్త్రీలకు ఎదురయ్యే శారీరక, మానసిక రుగ్మతలు, అందుబాటులోకి వచ్చిన ఆధునిక చికిత్సా విధానాల గురించి కూలకుషంగా చర్చించారు. ఈ సదస్సుకు లబ్బీపేటలోని ప్రశాంత్ అడ్వాన్స్డ్ యురాలజీ, గైనకాలజీ అండ్ రోబోటిక్ సర్జరీ హాస్పిటల్ నందు సెక్రటేరియట్ ఏర్పాటు చేశారు. విజయవాడ అబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ సౌజన్యంతో నిర్వహించిన ఈ సదస్సుకు డాక్టర్ ఆర్ఎస్ రమాదేవి, డాక్టర్ వి. పద్మజ, డాక్టర్ పి. సుశీల పాట్రన్లుగా వ్యవహరించారు. వీఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.బి. గాయత్రి, జాయింట్ సెక్రటరీ డాక్టర్ జె. ప్రత్యూష, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు డాక్టర్ ఎం. పార్వతీదేవి, డాక్టర్ పి. అరుణకుమారి, డాక్టర్ ఎ. మధుబిందు, డాక్టర్ ఎస్. ఉషారాణి, డాక్టర్ వి. ప్రశాంతి, డాక్టర్ వి.కె. జ్యోతిర్మయి, డాక్టర్ సి. ప్రసన్న, డాక్టర్ జి. నిఖిత తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి







