శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్

- December 19, 2025 , by Maagulf
శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్

న్యూ ఢిల్లీ: భారత సాంకేతిక, ఇంధన రంగాల్లో విప్లవాత్మక మార్పులకు బాట వేస్తూ పార్లమెంట్ ప్రతిష్టాత్మకమైన ‘శాంతి’ బిల్లు 2025 ను ఆమోదించింది. గురువారం రాజ్యసభలో బిల్లుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో, దేశ అణుఇంధన రంగం తొలిసారిగా ప్రైవేట్ భాగస్వామ్యానికి అధికారికంగా తెరచుకుంది.

శాంతి బిల్లు ఆమోదంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారత సాంకేతిక ముఖచిత్రాన్ని మార్చే ఒక అద్భుతమైన మలుపు అని వ్యాఖ్యానించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన విద్యుత్తు అందించడంలో ఈ చట్టం కీలకంగా మారుతుందని తెలిపారు. యువతకు, ప్రైవేట్ రంగానికి అపార అవకాశాలు లభిస్తాయని, భారత్‌లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని ప్రధాని పేర్కొన్నారు.

శాంతి బిల్లు అమల్లోకి రావడంతో

అణుశక్తి చట్టం–1962
సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ – 2010
స్థానంలో కొత్త చట్టం అమలవుతుంది. ఇప్పటివరకు ప్రభుత్వ గుత్తాధిపత్యంగా ఉన్న అణుఇంధన రంగంలోకి ఇకపై భారతీయ ప్రైవేట్ సంస్థలు ప్రవేశించవచ్చు. ఈ బిల్లు ద్వారా ప్రైవేట్ కంపెనీలకు అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణ చేసే అవకాశం లభిస్తుంది. అలాగే అణుశక్తి నియంత్రణ మండలికి స్వయంప్రతిపత్తితో కూడిన చట్టబద్ధ హోదా కల్పించారు. భద్రతా ప్రమాణాల పర్యవేక్షణలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.

అణు ప్రమాదాల పరిహారం, పెట్టుబడులకు ఊతం
అణు ప్రమాదాల సందర్భంలో పరిహారం చెల్లించే బాధ్యతను ప్లాంట్ సామర్థ్యం ఆధారంగా క్రమబద్ధీకరించారు. సరఫరాదారులపై ఉన్న కొన్ని కఠిన నిబంధనలను సడలించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు మార్గం సుగమమైంది. ఇక స్వచ్ఛమైన ఇంధన లక్ష్యాల సాధన కోసం స్మాల్ మోడ్యులర్ రియాక్టర్లు (SMRs) అభివృద్ధికి ఈ బిల్లు పెద్దపీట వేస్తుంది.

2047 నాటికి 100 గిగావాట్ల లక్ష్యం
ప్రస్తుతం భారత్ అణుశక్తి ఉత్పత్తి సామర్థ్యం సుమారు 8.8 గిగావాట్లుగా ఉంది. శాంతి బిల్లు ద్వారా ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించి 2047 నాటికి 100 గిగావాట్ల సామర్థ్యం సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించి నెట్ జీరో లక్ష్యాలను చేరుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.బాధ్యత నిబంధనల సడలింపుపై ప్రతిపక్షాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఇది దేశాభివృద్ధికి తప్పనిసరి అడుగేనని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com