రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..

- December 23, 2025 , by Maagulf
రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..

తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు.ముఖ్యంగా పొగమంచు కమ్ముకోవడంతో దృశ్యత తగ్గిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం..రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో కేవలం ఏడు డిగ్రీలు నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. సుమారు 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 14డిగ్రీల లోపు కొనసాగుతున్నాయి.సాధారణం కంటే 3 నుంచి నాలుగు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఉదయం, రాత్రి వేళల్లో బయటకు రావొద్దని, ఒకవేళ వచ్చిన చలి నుంచి రక్షణ పొందేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

చలి నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి వస్త్రధారణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. స్వెటర్ లేదా జాకెట్ ధరించడం వల్ల శరీర వేడి బయటకు పోకుండా ఉంటుంది. ముఖ్యంగా తల, చెవుల ద్వారా శరీర ఉష్ణోగ్రత త్వరగా తగ్గిపోయే అవకాశం ఉన్నందున మఫ్లర్లు లేదా మంకీ క్యాప్‌లు వాడాలి. చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు ధరించడం వల్ల రక్తప్రసరణ సాఫీగా జరిగి శరీరం వెచ్చగా ఉంటుంది.

కొద్దిరోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.రాబోయే రోజుల్లోనూ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంటుంది.ఈ సమయంలో ప్రజలు చలి నుంచి రక్షణ పొందేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చలి కాలంలో దాహం తక్కువగా వేసినప్పటికీ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడానికి గోచువెచ్చని నీటిని తరచుగా తాగుతుండాలని సూచించారు. అల్లం టీం, తులసి కషాయం, వేడి సూప్‌లు తీసుకోవడం వల్ల గొంతు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com