భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్

- February 02, 2026 , by Maagulf
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్

అమెరికా: భారత్ కు అమేరికా అధ్యక్షుడు ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. టారిఫ్‌లు 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా భారత ప్రధాని మోదీతో ఆయన మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనర్హం. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు. “ఈ ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడడాన్ని గౌరవంగా భావిస్తున్నాను.మోదీ నా గొప్ప స్నేహితుల్లో ఒకరు. ఆయన భారత్ లో అత్యంత శక్తిమంతమైన నేత. మేం ఇవాళ ఫోన్ కాల్ లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. వాణిజ్యం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు తదితర అంశాలు చర్చకు వచ్చాయి.

రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు మోదీ అంగీకరించారు. అమెరికా నుంచి, దాంతో పాటే వెనెజువెలా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. ఈ నిర్ణయం ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నాను. ప్రతి వారం వేలమంది చనిపోతున్న ఆ యుద్ధానికి ఈ నిర్ణయం చరమగీతం పాడుతుందని అనుకుంటున్నాను. మోదీతో స్నేహం, గౌరవం ఇవన్నీ కాకుండా… ఆయన విజ్ఞప్తి మేరకు అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందానికి ఆమోదం తెలిపాం. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 25 శాతం టారిఫ్ లు 18 శాతానికి తగ్గుతాయి. అదే సమయంలో భారత్ వైపు నుంచి కూడా టారిఫ్ లు తగ్గుతాయనుకుంటున్నాను.

దాంతోపాటే, పూర్తి పన్ను రహిత వాణిజ్యానికి ద్వారాలు తెరుచుకుంటాయని ఆశిస్తున్నాను. అమెరికా తయారీ వస్తువుల కొనుగోలు పట్ల కట్టుబడి ఉంటారని ప్రధాని మోదీ మాటిచ్చారు. ఈ వాణిజ్యం దాదాపు 500 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చు. ఇందులో ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయం, బొగ్గు తదితర ఉత్పత్తులు ఉన్నాయి. భారత్ తో అమెరికా అద్భుతమైన సంబంధాలు మరింత దృఢంగా ముందుకు వెళతాయి. నేను, ప్రధాని మోదీ ఈ ఒప్పందానికి ఓ రూపం కల్పించాం…ఇంతకుమించి ఎక్కువగా చెప్పలేం” అంటూ ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com