SRH vs RCB మ్యాచ్ టికెట్ల పేరిట కొత్త సైబర్ దందా.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!

- May 16, 2026 , by Maagulf
SRH vs RCB మ్యాచ్ టికెట్ల పేరిట కొత్త సైబర్ దందా.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!

క్రికెట్ అభిమానుల క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకునేందుకు సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. మే 22వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ టికెట్ల పేరుతో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ వెల్లడించారు. ఈ క్రేజీ మ్యాచ్‌కు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని నకిలీ టికెట్ల దందా సాగిస్తున్న ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

ఐపీఎల్ టికెట్ల విక్రయానికి సంబంధించిన అధికారిక టికెటింగ్ భాగస్వామి ‘డిస్ట్రిక్ట్’ (District) అప్లికేషన్‌ను పోలిన కొన్ని నకిలీ యాప్‌లను, వెబ్‌సైట్ లింకులను కేటుగాళ్లు సృష్టించారని సీపీ తెలిపారు. మ్యాచ్ టికెట్లు తక్కువ ధరకే ఇస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు గుప్పిస్తూ అమాయక అభిమానులను ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. బ్లాక్‌లో టికెట్లు దొరుకుతున్నాయని నమ్మి ఆయా నకిలీ లింకుల ద్వారా డబ్బులు చెల్లించి మోసపోవద్దని ఆయన సూచించారు.

IPL 2026 Tickets Scam: సైబర్ ముఠాల ఉచ్చులో పడకుండా సీపీ సజ్జనార్ సూచనలు
టికెట్లు కొనుగోలు చేసేటప్పుడు కేవలం అధికారిక యాప్‌లు లేదా గుర్తింపు పొందిన వెబ్‌సైట్లను మాత్రమే ఆశ్రయించాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వచ్చే అపరిచిత లింకులను క్లిక్ చేసి నగదు చెల్లించవద్దని కోరారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాల బారిన పడితే తక్షణమే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనార్ సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com