విజయవాడలో అర్థరాత్రి హైడ్రామా
- May 22, 2026
విజయవాడ: విజయవాడ నగరంలో కొందరు యువకులు అర్ధరాత్రి వేళ రోడ్లపైకి వచ్చి నడిరోడ్డును రేసింగ్ ట్రాక్గా మార్చేస్తూ తీవ్ర హల్చల్ చేశారు. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక హై టెన్షన్ లైన్ రహదారిపై రెండు వర్గాలకు చెందిన యువకులు తమ కార్లతో వీరంగం సృష్టించారు. రోడ్డుపై కార్లతో ప్రమాదకరంగా ప్రయాణిస్తూ, ఆధిపత్యాన్ని ప్రదర్శించే క్రమంలో ఒకరినొకరు కార్లతో ఢీకొట్టుకున్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకున్న ఈ భీకర ఘటనతో స్థానిక నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
చీకటి పడితే చాలు రోడ్లపై రేసింగ్లు, విన్యాసాలతో రెచ్చిపోయే ముఠాలు ఈసారి ఏకంగా కార్లనే ఆయుధాలుగా మార్చుకున్నాయి. రెండు వర్గాల మధ్య రేగిన ఆధిపత్య పోరు కాస్తా.. ఒకరి కారును మరొకరు అడ్డంగా వేసి ఢీకొట్టుకునే వరకు వెళ్లింది. కార్ల ఇంజన్ల శబ్దాలు, బ్రేకుల అరుపులతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ప్రమాదకర రీతిలో సాగిన ఈ కార్ల ఫైట్ను చూసి స్థానికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు.
రోడ్డుపై యువకులు శృతిమించి ప్రవర్తిస్తుండటంతో, స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పటమట సీఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్) పవన్ కిషోర్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన ఇరు వర్గాలకు చెందిన యువకులను వారు చాకచక్యంగా అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం నిందితులందరినీ పటమట పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరంగ సృష్టించడానికి ఉపయోగించిన కార్లను కూడా పోలీసులు సీజ్ చేసినట్లు సమాచారం. ఈ అర్ధరాత్రి గొడవకు, కార్ల రేసింగ్కు గల అసలు కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును ముమ్మరం చేశారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







