పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- July 21, 2026
మచిలీపట్నం: ప్రధాన మంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ (PM-USHA) పథకం కింద మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డా. సుకాంత మజుందార్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, కృష్ణా యూనివర్సిటీకి కేటాయించిన రూ.20 కోట్లను మౌలిక వసతుల అభివృద్ధి, భవనాల మరమ్మతులు, ఆధునిక విద్యా పరికరాల కొనుగోలు, పరిశోధన సదుపాయాల విస్తరణతో పాటు ఇతర విద్యా అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన అన్ని ప్రతిపాదనలను కేంద్రం పరిశీలించి ఆమోదించిందని, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలు ప్రస్తుతం ఏవీ లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా పీఎం-ఉషా పథకం కింద మొత్తం 33 యూనిట్లకు రూ.378.75 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో 7 విశ్వవిద్యాలయాలు, 21 ప్రభుత్వ కళాశాలలు, 5 జిల్లాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి.
కృష్ణా జిల్లా నుంచి మొత్తం నాలుగు ప్రతిపాదనలు కేంద్రానికి పంపగా, వాటిలో మూడు ఆమోదం పొందాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
- కృష్ణా యూనివర్సిటీ, మచిలీపట్నం – రూ.20 కోట్లు
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బంటుమిల్లి – రూ.5 కోట్లు
- కృష్ణా జిల్లా (జెండర్ ఇన్క్లూజన్ అండ్ ఈక్విటీ ఇనిషియేటివ్స్) – రూ.10 కోట్లు
ఈ నిధులు జిల్లాలో ఉన్నత విద్యా రంగానికి మరింత ఊతమిస్తాయని ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, పరిశోధన అవకాశాల విస్తరణకు ఈ నిధులు దోహదపడతాయని తెలిపారు.
విద్యా రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, పీఎం-ఉషా పథకం ద్వారా కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలకు విశేష ప్రయోజనం చేకూరుతుందని ఎంపీ బాలశౌరి ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







