దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ పై కొత్త చట్టం జారీ చేసిన షేక్ మహ్మద్
- June 01, 2026
దుబాయ్: యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి మరియు దుబాయ్ పాలకుడు హిజ్ హైనెస్ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ (CDA)కు సంబంధించిన 2026 నాటి చట్టం నెం.12ను జారీ చేశారు. ఈ కొత్త చట్టం ద్వారా దుబాయ్ సామాజిక రంగ అభివృద్ధి, సామాజిక సేవల నాణ్యత మెరుగుదల, బలహీన వర్గాల రక్షణ మరియు సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
కొత్త చట్టం ప్రకారం, కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ సామాజిక రంగానికి సంబంధించిన విధానాలు, వ్యూహాలను రూపొందించడం, సంబంధిత చట్టాలను ప్రతిపాదించడం, సామాజిక సంస్థలు మరియు నిపుణుల లైసెన్సింగ్, నియంత్రణ బాధ్యతలను నిర్వహిస్తుంది. అలాగే స్వచ్ఛంద సేవా కార్యక్రమాల నిర్వహణ, సామాజిక సేవల అందుబాటు, బలహీన వర్గాల సాధికారత, కుటుంబ సంక్షేమం మరియు సామాజిక సమగ్రత పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
చిన్నారులు, ప్రత్యేక సంరక్షణ అవసరమైన వారికి రక్షణ
ఈ చట్టం ప్రకారం మైనర్లు, చట్టపరమైన సామర్థ్యం లేని వ్యక్తులు, పరిమిత సామర్థ్యం కలిగిన వ్యక్తుల సంక్షేమ బాధ్యతలను కూడా కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ చేపడుతుంది. న్యాయస్థానాలు లేదా సంబంధిత అధికారుల నిర్ణయాల ఆధారంగా వారికి సామాజిక సేవలు అందించడం, వారి జీవన పరిస్థితులను పర్యవేక్షించడం, విద్య, ఆరోగ్యం, వినోదం వంటి అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకోవడం అథారిటీ బాధ్యతగా ఉంటుంది.
తక్కువ ఆదాయం కలిగిన వారి గుర్తింపు
తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తుల నిర్వచనం, వర్గీకరణ కోసం ప్రత్యేక ప్రమాణాలను రూపొందించే బాధ్యత కూడా అథారిటీకి అప్పగించారు. ఆర్థిక, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రమాణాలను కాలానుగుణంగా సమీక్షించి, అవసరమైన సిఫార్సులను దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కు సమర్పించనుంది.
‘సోషల్ అబ్జర్వేటరీ’ ఏర్పాటు
సమాజంలో ఉత్పన్నమవుతున్న సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించేందుకు అథారిటీ పరిధిలో ‘సోషల్ అబ్జర్వేటరీ’ ఏర్పాటు చేయనున్నారు. ఇది సామాజిక ధోరణులను అధ్యయనం చేయడం, డేటాను సేకరించి విశ్లేషించడం, సమస్యల కారణాలను గుర్తించడం, వాటి ప్రభావాన్ని అంచనా వేయడం వంటి పనులు నిర్వహిస్తుంది. ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన సమగ్ర సామాజిక డేటాబేస్ను రూపొందించనుంది.
సామాజిక సేవల కోసం ఏకీకృత వ్యవస్థ
దుబాయ్లో సామాజిక, మానవతా సేవలు అవసరమైన కేసుల నిర్వహణ కోసం ఒక ఏకీకృత డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చట్టం పేర్కొంది. దీని ద్వారా అవసరమైన వ్యక్తులకు సమగ్ర సేవలు, సహాయం వేగంగా అందేలా సమన్వయం చేయబడుతుంది.
కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు
కొత్త చట్టం కింద‘కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫండ్’ను కూడా ఏర్పాటు చేశారు. ఈ నిధుల ద్వారా అర్హులైన వర్గాలకు ఆర్థిక సహాయం, సామాజిక ప్రాజెక్టులకు నిధులు, విపత్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు అందించనున్నారు. నిరుద్యోగులకు వృత్తి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సామాజిక అభివృద్ధిలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కూడా ఈ నిధి లక్ష్యాలలో భాగం.
పాత చట్టాలకు బదులుగా కొత్త చట్టం
ఈ చట్టం అమల్లోకి రావడంతో 2015 నాటి చట్టం నెం.8 మరియు 2020 నాటి చట్టం నెం.15 రద్దు కానున్నాయి. అయితే పాత చట్టాల కింద జారీ చేసిన నిబంధనలు, నిర్ణయాలు కొత్త చట్టానికి విరుద్ధంగా లేని వరకు కొనసాగుతాయి.
అధికారిక గెజిట్లో ప్రచురించిన తేదీ నుంచే ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







