అపోలో హెల్త్‌టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా శోభన కామినేని

- June 16, 2026 , by Maagulf
అపోలో హెల్త్‌టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా శోభన కామినేని

హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద హెల్త్‌కేర్ నెట్‌వర్క్ అయిన అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ తమ వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అపోలో గ్రూప్ నుంచి కొత్తగా రూపుదిద్దుకుంటున్న డిజిటల్ హెల్త్, ఫార్మసీ విభాగం ‘అపోలో హెల్త్‌టెక్’ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా శోభన కామినేనిని నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కీలక నియామకంతో కంపెనీ తన డిజిటల్ విభాగాన్ని మరింత విస్తరించడంతో పాటు ఐపీఓ (IPO) ప్రణాళికలను వేగవంతం చేసింది. ఈ నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలను సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించింది.

రాబోయే రెండేళ్లలో ఐపీఓ
అపోలో హాస్పిటల్స్ తన డిజిటల్ హెల్త్, ఫార్మసీ వ్యాపారాలను ప్రధాన సంస్థ నుంచి వేరుచేసి ‘అపోలో హెల్త్‌టెక్’ పేరుతో ఒక ప్రత్యేక విభాగంగా తీర్చిదిద్దుతోంది. రాబోయే 18 నుంచి 24 నెలల వ్యవధిలో ఈ కొత్త సంస్థను ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలని యాజమాన్యం గట్టి లక్ష్యంగా పెట్టుకుంది. అపోలో 24/7 డిజిటల్ ప్లాట్‌ఫామ్, ఓమ్ని-ఛానెల్ ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్, టెలీహెల్త్ సేవలు. మార్కెట్లో లిస్టింగ్ అయ్యే నాటికి అపోలో హెల్త్‌టెక్ ద్వారా ఏటా రూ. 25,000 కోట్ల ఆదాయం సాధించాలని కంపెనీ నిర్దేశించుకుంది.

ఈ భారీ లక్ష్యాలను చేరుకోవడంలో, సంస్థను తదుపరి వృద్ధి దశకు తీసుకెళ్లడంలో శోభన కామినేని కీలక పాత్ర పోషిస్తారని అపోలో యాజమాన్యం వెల్లడించింది. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ బోర్డులో ప్రమోటర్ డైరెక్టర్‌గా ఉన్న ఆమె నియామకానికి వాటాదారులు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) నుంచి తుది ఆమోదం లభించాల్సి ఉంది.

నలుగురు కుమార్తెల చేతిలో అపోలో సామ్రాజ్యం
అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు, పద్మవిభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికి నలుగురు కుమార్తెలు కాగా, వారందరూ ఈ గ్రూప్‌లో బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఈ కొత్త విభాగానికి బాధ్యతలు చేపట్టబోతున్న శోభన కామినేని, ప్రతాప్ రెడ్డికి మూడో కుమార్తె. ఈమె టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, కొణిదెల ఉపాసన కామినేనికి స్వయంగా తల్లి. మిగిలిన ముగ్గురు కుమార్తెలలో.. పెద్ద కుమార్తె డాక్టర్ ప్రీతారెడ్డి అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్‌పర్సన్‌గా, రెండో కుమార్తె సునీతా రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా, చిన్న కుమార్తె డాక్టర్ సంగీతా రెడ్డి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా గ్రూప్ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు.

ప్రతాప్ సి.రెడ్డి కుమార్తెలతో పాటు వారి తర్వాతి తరం కూడా అపోలో గ్రూప్ సేవల విస్తరణలో చురుగ్గా పాల్గొంటోంది. శోభన కామినేని కుమార్తె ఉపాసన కామినేని కొణిదెల ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) విభాగానికి వైస్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనితో పాటు ఆమె సమాజంలో ఆరోగ్య అవగాహన కోసం ‘URLife’ అనే వెల్‌నెస్ ప్లాట్‌ఫామ్‌ను స్థాపించి, దానికి ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా విజయవంతంగా కొనసాగుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com