భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- June 26, 2026
బాపట్ల: మాతృదేశం పై ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు 94ఏళ్ల ప్రవాసాంధ్రురాలు కొండ్రగుంట మహాలక్ష్మమ్మ. అమెరికా పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకొని.. భారతీయురాలిగానే తన చివరి శ్వాస విడవాలని కోరుతూ భారత పౌరసత్వంకోసం దరఖాస్తు చేశారు. స్వగ్రామంలోనే తన అత్యక్రియలు జరగాలని కలెక్టర్ ను వేడుకోవడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. బాపట్ల కలెక్టరేట్ లో జరిగిన ఈ ఘటనలో వృద్ధురాలు చేసిన విజ్ఞప్తి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మాతృభూమి పై మమకారం ఎంత గొప్పదో చాటిచెప్పిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. బాపట్ల జిల్లాచినగంజాం మండలం చింతగుంపల గ్రామానికి చెందిన కొండ్రుగుంట మహాలక్ష్మమ్మ (భర్త నాగభూషణం చనిపోయారు) భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. భర్త మరణం తరువాత ఆమె అమెరికా వెళ్లారు. అమెరికాలోని వర్జీనియా పీటర్స్బర్గ్లో స్థిరపడిన ప్రముఖ క్యాన్సర్ వైద్యుడైన తన కుమారుడు బుచ్చయ్య చౌదరి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే 2000 జులై 27న మహాలక్ష్మమ్మ అమెరికా పౌరసత్వం పొందారు. ఆ తరువాత 18ఏళ్లు అక్కడే ఉన్నారు. 2018 సంవత్సరంలో తిరిగి ఇండియాకు వచ్చారు. అప్పటి నుంచి స్వగ్రామం చింతగుంపలలో నివసిస్తున్నారు.
భారత పౌరురాలిగా చివరి శ్వాస సొంతూరులోనే తీసుకోవాలన్నది ఆమె కోరిక. ఈ క్రమంలో తిరిగి భారత పౌరసత్వం పొందడానికి ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం కలెక్టర్ వినోద్ కుమార్ లక్ష్మమ్మ దరఖాస్తుపై విచారణ జరిపారు. విచారణకు హాజరైన ఆమె భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, చట్టానికి లోబడి ఉంటానని కలెక్టర్ వద్ద వాగ్దానం చేశారు. వృద్ధాప్యంలో ఉన్న తనకు స్వదేశంలో జీవించడానికి చట్టం ప్రకారం హక్కు కల్పించాలని విన్నవించారు. ఆమె వెంట కుమారుడు బుచ్చయ్య చౌదరి కూడా ఉన్నారు. ఆయన ప్రస్తుతం మంగళగిరి ఎన్ఆర్ఐ వైద్య కళాశాల డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
నా చివరి శ్వాస కూడా భారతదేశంలోనే తీసుకోవాలని ఆమె పేర్కొనడం అందరినీ కదలిస్తుంది. నా అంత్యక్రియలు కూడా నా సొంత గ్రామంలోనే జరగాలని చెబుతూ, వీలైనంత త్వరగా తనకు భారత పౌరసత్వం మంజూరు చేయాలని మహాలక్ష్మమ్మ కలెక్టర్ను వేడుకున్నారు.
తాజా వార్తలు
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!







