RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష

- June 26, 2026 , by Maagulf
RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష

అమరావతి: కేవలం ఆధార్ సంఖ్యను నమోదు చేయగానే నిరుద్యోగ అభ్యర్థుల విద్య, క్రీడా ధృవపత్రాలన్నీ డిజిటల్ పద్ధతిలో తనిఖీ అయ్యేలా ఒక పారదర్శకమైన, పటిష్ఠమైన వ్యవస్థను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఈ నూతన విధానం వల్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఎంతో సులువవుతుందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారీగా చేపట్టబోయే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సమయంలో లక్షలాది మంది అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం దోహదపడుతుందని స్పష్టం చేశారు. అభ్యర్థి ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే సదరు సర్టిఫికెట్‌ను ఏ సంస్థ ఇచ్చింది, ఎప్పుడు జారీ చేసింది అనే వివరాలన్నీ రియల్ టైమ్‌లో లభించేలా ‘డిజి వెరిఫై’ (Digi Verify) విధానాన్ని రూపొందించాలన్నారు. ఇది అధికారుల శ్రమను 99 శాతం మేర తగ్గిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆర్టీజీఎస్ ప్రగతి పై ఉన్నత స్థాయి సమీక్ష
శుక్రవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ (RTGS) కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రి నారా లోకేశ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ నిర్దేశించుకున్న లక్ష్యాలు, ప్రస్తుతం నడుస్తున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని ఆ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి కూలంకషంగా వివరించారు.

జులై నాటికి ‘డేటా లేక్’ పనులు పూర్తి కావాలి
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాల సమాచారాన్ని ఒకే వేదికపైకి తెచ్చే ‘డేటా లేక్’ (Data Lake) ప్రాజెక్టు పనులను రాబోయే జులై నాటికి పూర్తి చేయాలని మంత్రి లోకేశ్ అధికారులకు గడువు విధించారు. పాఠశాలల్లో చదువు మధ్యలోనే ఆపేస్తున్న విద్యార్థుల (డ్రాప్ అవుట్స్) వివరాలను ఈ డేటా లేక్ సహాయంతో విశ్లేషించి, వారిని మరల బడిబాట పట్టించేలా తగిన వ్యూహాలు సిద్ధం చేయాలని సూచించారు. దీంతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణకు ఉద్దేశించిన ‘సంజీవని’ కార్యక్రమాన్ని కూడా ఈ డేటా లేక్‌తో అనుసంధానం చేయాలని ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com